Begin typing your search above and press return to search.

నా ప్రతి అడుగులో నాన్న : సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   2 Sep 2020 9:50 AM GMT
నా ప్రతి అడుగులో నాన్న : సీఎం జగన్ !
X
జన హృదయాల్లో గూడు కట్టుకున్న మహా నేత, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో అయన పేరు తెలియని వారు అంటూ ఎవరూ లేరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే, ఆయన చనిపోయి 11 ఏళ్లయినా ఇంకా గుర్తుపెట్టుకునేలా చేశాయి. ప్రతి గడప ఆయన పెట్టిన ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొంది ఉంటుంది. అందుకే ఆయన మహానేత అయ్యాడు. ఆ మహానేత 11వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయకు వెళ్లిన జగన్ ముందుగా వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వందనాలు సమర్పించారు. ఆ తర్వాత వైఎస్ వైఎస్ సమాధి దగ్గర సీఎం జగన్ నివాళులు అర్పించారు.

సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా, వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జగన్ తో పాటుగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జగన్తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో వారంతా కలిసి పాల్గొన్నారు.