Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాపై పోలీసుల ఐ..తేడా వ‌స్తే అంతే

By:  Tupaki Desk   |   5 Dec 2019 11:33 AM GMT
సోష‌ల్ మీడియాపై పోలీసుల ఐ..తేడా వ‌స్తే అంతే
X
సున్నితమైన అంశాలు - వ్యక్తిగతంగా ఇతరులను కించపర్చేలా - అగౌరవ పరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారిపై పోలీస్‌ లు సీరియస్‌ గా దృష్టిపెట్టారు. దిశ హత్యోదంతంపై ఇటీవల నీచమైన వ్యాఖ్యలు చేసినవారు కటకటాల పాలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ అనవసర గందరగోళం సృష్టించే వారిపై సైబర్ క్రైం పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రిని అరెస్టు చేశారు.

సోషల్‌మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ లోని రాయదుర్గంకు చెందిన ఓ వైద్యురాలి ఫేస్‌ బుక్ ఖాతాలో ఒక పేరొందిన మహిళ పోస్ట్‌ పై అనిల్‌ కుమార్ అంబాల అనే యువకుడు అసభ్యంగా కామెంట్‌ ను పెట్టాడు. ఇది మహిళ ప్రతిష్ఠ కు భంగం కలిగించేలా ఉండటంతో వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనిల్‌ కుమార్‌ ను నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో అరెస్టు చేసి - నగరంలోని 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఇదే విషయంలో ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఫేస్‌ బుక్‌ లో సిమ్లీ నానీ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన కనుగుళ్ల సాయినాథ్.. తరచూ మహిళల గూర్చి అసభ్యకర పోస్టింగులు పెడుతున్నాడు. ఇదేక్రమంలో దిశపై అఘాయిత్యం జరుగడంతో తప్పులేదన్నట్టు పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టింగ్‌ లకు ముగ్గురు నలుగురు అనుకూల కామెంట్లు చేయగా - మరికొందరు భగ్గుమన్నారు. ఈ పోస్టింగ్‌ పై సైబర్‌ క్రైం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

కాగా - ఫేస్‌ బుక్‌ - ట్విట్టర్ పోస్టింగ్‌ ల‌ను పోలీసులు గ‌మ‌నిస్తున్నారు. అనుమానాస్పదంగా జరిగిన పోస్టింగ్స్ పై ఆరా తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో యువ‌త సంయ‌మ‌నం పాటించాల‌ని పేర్కొంటున్నారు. ఇబ్బందిక‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌కు భారీ మూల్యం చెల్లించ‌కత‌ప్ప‌ద‌ని అంటున్నారు.