Begin typing your search above and press return to search.

ప‌ట్టిసీమ‌కు ఈ షాక్ ఊహించారా?

By:  Tupaki Desk   |   3 July 2016 10:50 AM GMT
ప‌ట్టిసీమ‌కు ఈ షాక్ ఊహించారా?
X
ప‌ట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న ఆశలపై కేంద్ర జలసంఘం నీళ్ళు చల్లింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీ నింపుకుని కృష్ణా నదినీటిలో ఏపీకి వాటాగా లభించే నీటిని రాయలసీమకు తరలించాలని చంద్రబాబు భావించారు. అంతేకాకుండా పట్టిసీమ ద్వారా తరలించే నీటితో కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీరివ్వవచ్చని ఆశించారు. అయితే దీనికి విరుద్ధంగా అనేక నిబంధనలతో కూడిన హైడ్రాలజీ అనుమతులను కేంద్ర జలసంఘం జారీ చేసింది. సీడబ్ల్యూసీ తాజాగా పంపిన లేఖలో అనేక పరిమితులను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించే నీటిని కేవలం తాగునీరు - పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.

గోదావరి నదికి వరదలు వచ్చే కాలంలో జులై నుంచి నవంబర్‌ మధ్యకాలంలో మాత్రమే నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించుకోవడానికి కేంద్ర జ‌ల‌సంఘం అనుమతించింది. పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మించక పోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెల్టా అవసరాలు తీరిన తర్వాత వృథాగా పోయే నీటిని ప్రాతిపదికగా తీసుకుని మిగులు జలాలను అంచనా వేయాలని కోరింది. కేవలం పది సంవత్సరాల కాలంలో మిగులు జలాల లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో భాగమేనని ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న వాదనను కేంద్రం పట్టించుకోలేదు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో గత నాలుగు సంవత్సరాలుగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల సాగుకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు నీటి వినియోగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కూడా లేదు. 2015 సంవత్సరంలో కూడా శ్రీశైలం - నాగార్జునసాగర్‌ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీనితో కృష్ణా డెల్టాలోని పంటలకు సాగునీరందలేదు. దీనితో పట్టిసీమ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ పథకాన్ని పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా భావించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం వల్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్టు కేంద్ర జలసంఘానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 80 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించుకునే అనుమతులను కేంద్ర జలసంఘం గతంలోనే ఇచ్చిందని స్పష్టం చేసింది. ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టుకు కింది భాగంలో ధవళేశ్వరం బ్యారేజీకి 31 కిలోమీటర్ల ఎగువభాగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పోలవరం కుడి కాలువ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసి కాలువ ద్వారా కృష్ణా బ్యారేజీకి నీటిని తరలిస్తామని ప్రతిపాదించింది. ఎనిమిది పంపుల ద్వారా సెకనుకు 240 క్యూమెక్కుల నీటిని తరలించడానికి అనుమతి కోరింది. కేంద్ర జలసంఘం అనుమతులు రాకముందే గత సంవత్సరం ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దశల పనులను ఇప్పటికే పూర్తి చేసింది.

ఈ క్ర‌మంలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను తెలిపింది. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూనే మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం అక్రమమని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బ్యారేజీకి తరలించే నీటిలో 45 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు ట్రిబ్యునల్‌ కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడడంతో ఈ నీటిలో తమకు కూడా వాటా ఉంటుందని వాదించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టుకు అదనంగా ఏపీ నిర్మిస్తున్నదని తెలిపింది. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో తాజాగా సీడ‌బ్ల్యూసీ కొత్త నిబంధ‌న‌లు విధించింది.