Begin typing your search above and press return to search.

చిరంజీవి చిల్ల‌ర బేర‌గాడు: సీపీఐ నేత నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   18 July 2022 11:01 AM GMT
చిరంజీవి చిల్ల‌ర బేర‌గాడు: సీపీఐ నేత నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!
X
మెగాస్టార్ చిరంజీవి చిల్ల‌ర బేర‌గాడు అంటూ సీపీఐ నేత నారాయ‌ణ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు బ్రోక‌ర్, చిల్ల‌ర బేర‌గాడు చిరంజీవిని వేదిక‌పైకి పిల‌వ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు. అల్లూరి సీతారామరాజును అందరికీ తెలిసేలా చేసింది సూప‌ర్ స్టార్ కృష్ణ అని.. ఆయ‌న‌ను పిల‌వ‌కుండా చిల్ల‌ర గాళ్ల‌ను వేదిక‌పైకి ఎక్కించి బీజేపీ ప‌రువు పోగొట్టుకుంద‌ని నారాయ‌ణ నిప్పులు చెరిగారు.

అలాగే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌న్ ల్యాండ్ మైన్ ల్యాండ్ వాడ‌ని.. అయితే అది ఎప్పుడు పేలుతుందో తెలియ‌ద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ అస్ప‌ష్ట‌త వీడి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి స‌హ‌క‌రించాల‌న్నారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ.. టీడీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వ‌డం సరికాద‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేసింది శూన్య‌మ‌ని.. అలాంటప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి ఎలా మ‌ద్ద‌తిస్తార‌ని నిల‌దీశారు.

కేంద్రంలోని బీజేపీ నేతల బెదిరింపుల‌కు ఏపీలో నేతలు భయపడుతున్నార‌ని నారాయ‌ణ ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత‌లు ఇంకా హైద‌రాబాదే రాజ‌ధాని అని అనుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా హైద‌రాబాద్ నుంచే విజ‌య‌వాడ వ‌స్తున్నార‌ని ఆరోపించారు.

ఏపీకి రాజధాని కావాలన్న ఆలోచన జ‌గ‌న్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని నారాయణ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రాకుండా చూడాలని సలహా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై జనసేన చేస్తున్న నిరసనల‌ను నారాయ‌ణ స్వాగ‌తించారు.

జ‌గ‌న్ ప్రభుత్వం వరదల భీభత్సాన్ని అంచనా వేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం తో ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.