Begin typing your search above and press return to search.

పండక్కి ఊరికి వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? మీరీ తప్పు చేస్తున్నట్లే!

By:  Tupaki Desk   |   8 Jan 2022 7:30 AM GMT
పండక్కి ఊరికి వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? మీరీ తప్పు చేస్తున్నట్లే!
X
ఏడాదిలో ఎన్ని పండగలు వచ్చినా సంక్రాంతి తర్వాతే. దసరా.. దీపావళి సందడి కూడా ఈ మూడు రోజుల పండగ తర్వాతే. తెలుగు వారంతా అత్యధిక ప్రాధాన్యత ఇస్తే ఈ పండగ వేళ.. ఎక్కడున్నా సరే.. ఊరికి వెళ్లే ప్లాన్ చేస్తుంటారు. ఏడాది మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా.. సంక్రాంతికి కాస్త ముందుగా ఊరికి వెళ్లటం.. మూడు రోజుల పండగను మరికాస్త ఉత్సాహంగా జరుపుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. గడిచిన దశాబ్ది కాలంలో సంక్రాంతికి ఊరెళ్లటం తప్పనిసరిగా మారింది.

ఈ పండక్కి వెళ్లినప్పుడు బంధువులు.. ఊరి వాళ్లతో పాటు.. పాత స్నేహితుల్ని కలుసుకోవటానికి వచ్చే అరుదైన అవకాశంగా మారటంతో.. సంక్రాంతికి ఊరికి వెళ్లాలన్న ఆసక్తి లేనోళ్లు సైతం.. ఈ మధ్యన వెళ్లటం అలవాటు చేసుకున్న పరిస్థితి. అయితే.. ఈ ఏడాదికి మాత్రం ఈ అలవాటుకు బ్రేక్ చెప్పటం మంచిదన్న మాట వినిపిస్తోంది. కారణం.. కరోనా మూడో వేవ్. తెలుగు ప్రజలంతా అయితే హైదరాబాద్ లేదంటే బెంగళూరులోనే ఎక్కువగా ఉండటం తెలిసిందే. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. ఈ రెండు మహానగరాల్లో ఉన్న తెలుగు వారు.. సంక్రాంతి పండక్కి ఉన్న ఊరును వదిలేసి.. సొంతూరుకు పయనం కావటం తెలిసిందే.

అయితే.. ఈసారి ఇలా ఊరెళ్లటం మన సంగతి తర్వాత.. మనం అమితంగా అభిమానించే ఊరికి ఏ మాత్రం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన వారం రోజుల్లో కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఎక్కువగా పెరుగుతున్నాయో తెలిసిందే. రోజురోజుకు ఒకట్రెండు రెట్టింపు స్థాయిల్లో పెరుగుతున్న వేళ.. చూస్తుండగానే వందలు దాటేసి.. వేల దిశగా పరుగులు తీస్తున్నాయి. జాతీయస్థాయిలో చూసినా.. లక్ష అంకెను కేసులు దాటేశాయి.

తెలుగు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు దాదాపు 30 లక్షలకు పైనే ఉంటారు. మరికొంత ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక.. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. రోజువారీ కేసుల్లో 60 శాతం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఒకవేళ.. గ్రేటర్ శివారులో నమోదయ్యేకేసుల్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం మొత్తంగా నమోదయ్యే కేసుల్లో 80 శాతం వరకు హైదరాబాద్.. శివారులోనే ఉంటాయి.

అంటే.. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి పయనమై గ్రామాలకు వెళ్లి.. అక్కడి ఆరోగ్య పరిస్థితుల్ని దెబ్బ తీయటమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహానగరం నుంచి ఊళ్లకు పయనమయ్యే వారు.. అంతో ఇంతో వైరస్ నుమోసుకెళ్లటం ఖాయం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి.. ఎలా అయితే వైరస్ ను పాకించేశారో.. మహానగరాల నుంచి ఊళ్లకు వెళ్లే వారు కూడా అలానే చేసినట్లు అవుతుంది.

అందుకే.. వీలైనంత వరకు ఊరికి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ ఒక్క ఏడాదికిఊరికి దూరంగా ఉంటూ.. ఎవరింట్లో వారు ఉంటూసంక్రాంతి చేసుకోవటం మనకే కాదు.. మనం ఎంతో ప్రేమించే మన ఊరికి మంచిదన్న మాట నిపుణుల నోట వినిపిస్తోంది. మరి.. ఈ జాగ్రత్తను ప్రజలు ఎంత వరకు పాటిస్తారో చూడాలి.