Begin typing your search above and press return to search.

ఊహించ‌ని తీరులో వార్త‌ల్లోకి వ‌చ్చిన ఐకియా!

By:  Tupaki Desk   |   30 Jan 2019 11:27 AM GMT
ఊహించ‌ని తీరులో వార్త‌ల్లోకి వ‌చ్చిన ఐకియా!
X
ఒక షోరూం ఓపెనింగ్ అయితే ట్రాఫిక్ జాం కావ‌టం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కామ‌నే. కాకుంటే.. భారీ షోరూం మొత్తం జ‌నంతో కిట‌కిట‌లాడిపోయి.. ప్ర‌జ‌లారా.. మా షోరూం మీకోసం 365 రోజులు ఉంటుంది.. మ‌రి.. ఇంత హ‌డావుడి ప‌డి వ‌చ్చి ఇబ్బంది ప‌డ‌కండి.. లాంటి ప్ర‌క‌ట‌న ఎప్పుడైనా.. ఏ మాల్ అయినా ఇచ్చిందా? ఇవ్వ‌లేదు. అలాంటి ప్ర‌క‌ట‌న ఇచ్చిన ఏకైక మాల్ ఐకియానే.

ఒక మాల్ ను త‌ల‌ద‌న్నేలా ఫ‌ర్నీచ‌ర్ షోరూంను స్టార్ట్ చేసిన యూరోపియ‌న్ కంపెనీ ఐకియా.. హైద‌రాబాద్ ఎంట్రీనే ఒక సంచ‌ల‌నంగా చెప్పాలి. దేశంలో మొద‌టి షోరూంను హైద‌రాబాద్‌ లో స్టార్ట్ చేసిన ఐకియా ఫ‌ర్నీచ‌ర్ వ్యాపార రంగంలో పెను సంచ‌ల‌నాన్నే న‌మోదు చేసింద‌ని చెప్పాలి. ఐకియా షోరూం ప్రారంభ‌మైన కొత్త‌ల్లో భారీ ట్రాఫిక్ జాంతో పాటు.. షోరూంకి వెళ్లాల‌నుకున్న వినియోగ‌దారులు త‌మ వాహ‌నాల్ని షోరూంకి అల్లంత దూరాన పార్క్ చేసుకోవాల‌ని.. త‌మ ప్ర‌త్యేక బ‌స్సులు షోరూం ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తాయ‌న్న ప్ర‌క‌ట‌న‌ను చేశారు. అంత‌లా ఐకియా షోరూం ఓపెనింగ్ కు రెస్పాన్స్ వ‌చ్చింది

ఇప్ప‌టివ‌ర‌కూ ఐకియాకు సంబంధించినంత వ‌ర‌కూ పాజిటివ్ స్టోరీలు.. సానుకూల వార్త‌లే కానీ ప్ర‌తికూల వార్త‌లు వ‌చ్చింది లేదు. కాంగ్రెస్ నేత రేవంత్ పుణ్య‌మా అని ఊహించిన విధంగా ఐకియా వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ‌డ్ ఫ‌ర్నీచ‌ర్ షోరూమ్‌ కు ఏ ప్రాతిప‌దిక‌న భూములు కేటాయించారంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.
దీంతో.. ఈ కేసు విచార‌ణ తాజాగా హైకోర్టుకు వ‌చ్చింది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఐకియాకు ఏ ప్రాతిప‌దిక‌న భూములు కేటాయించార‌న్న విష‌యాన్ని ప్ర‌భుత్వం త‌మ‌కు తెల‌పాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పిటిష‌న‌ర్ మాజీ ఎమ్మెల్యేఅని.. ఆయ‌న త‌ర‌ఫున తాను కోర్టులో వాదిస్తున్న‌ట్లుగా రేవంత్ త‌ర‌ఫు లాయ‌ర్ చెప్ప‌గా.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ గొంతును చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున వినిపించాల‌ని.. ఇలా కోర్టుల‌కు ఎందుకు వ‌స్తున్నారంటూ ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉంటే.. ఐకియా షోరూంకు కేటాయించిన భూముల కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా రేవంత్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఐకియాకు కేటాయించిన 16.27 ఎక‌రాల భూమిని నామినేష‌న్ ప‌ద్ద‌తిలో కాకుండా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా కేటాచింద‌ని రేవంత్ ఆరోపించారు. ఐటీ కంపెనీల‌కుమాత్ర‌మే కేటాయించాల్సిన భూమిని ఫ‌ర్నీచ‌ర్ షాపుకు కేటాయించార‌ని.. దీని కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.33 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని..దాదాపు రూ.500 కోట్లు న‌ష్టం వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచార‌ణ సాగించ‌నుంది. మ‌రి.. దీనికి ప్ర‌భ‌త్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.