Begin typing your search above and press return to search.

రాజధానిలో మరో అన్నదాత ఆత్మహత్య

By:  Tupaki Desk   |   21 Sep 2015 4:24 AM GMT
రాజధానిలో మరో అన్నదాత ఆత్మహత్య
X
రాజధానిలో.. ముఖ్యమంత్రి ఇంటికి కాస్త దూరంలో.. ఒక చెట్టుకు విగతజీవిగా వేలాడిన ఒక అన్నదాత..తెలంగాణ రాష్ట్రంలో సగటు రైతు కష్టానికి నిదర్శనం. వరుసగా వచ్చి పడ్డ కష్టాలతో కుదేలై.. వాటితో పోరాడలేక బతుకు చాలించాలని చెట్టుకు ఊరేసుకోవటం పలువురి మనసుల్ని కలిచివేస్తోంది. మొన్నటికి మొన్న లింబయ్య ఇదే తీరులో రాజధానిలో ఉరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి జగ్గోళ్ల మల్లేశం. 58 ఏళ్ల మల్లేశం జీవితంలో చాలానే ఆటుపోట్లు చవి చూశాడు.

ఏ కష్టంలోనూ బెదరని ఆయన.. అన్నదాతగా తనకొచ్చిపడిన ఆర్థిక సమస్యల్ని చూసుకొని తట్టుకోలేకపోయినట్లున్నాడు. అందుకేనేమో.. అన్నదాత ఆత్మగౌరవానికి నిదర్శనమైన తలపాగాతోనే తనవు చాలించుకున్నాడు. చిరుగులు పడిన తలపాగానే తాడుగా మార్చుకొని విగతజీవిగా వేలాడిన మల్లేశం సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో కనిపించి చాలానే కన్ఫ్యూజ్ చేశాడు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కాస్త దగ్గర్లోనే చెట్టుకు ఊరేసుకున్న ఈ ఉదంతాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంతకీ ఈ మల్లేశం ఎవరు? రైతుగా చెబుతున్న ఇతగాడు సెక్యూరిటీ గార్డు ఎందుకయ్యాడు? అతని గతం ఏమిటి? అన్ని అప్పులు ఎందుకు అయ్యాయన్న ప్రశ్నలు వేస్తే ఊహించని సమాధానాలు చాలానే వస్తాయి.

మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన మల్లేశానికి భార్య.. కొడుకు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం 58 మలిదశలో ఉన్నా.. దశాబ్ధన్నర క్రితం అడవిలో అన్నలతో కలిసి.. తుపాకీ పట్టుకొని సమాజం మార్పు కోసం ప్రయత్నించాడు. అయితే.. సమాజంలో మార్పు తుపాకీతో రాదని తేలిపోవటంతో.. తుపాకీ వదిలేసి.. పోలీసులకు లొంగిపోయి.. అన్నదాతగా మారిపోయాడు.

తనకున్న 3 ఎకరాల పొలంలో బోర్లు వేస్తే పడకపోవటం.. పంటలు పండకపోవటంతో అప్పులు మీద పడ్డాయి. అంతలోనే కూతురు వివాహం అతని జీవితాన్ని మరింత అప్పులపాలు అయ్యేలా చేసింది. నీళ్లు లేని భూమితో అవస్తలు పడుతూ.. అప్పుల భారం తగ్గించుకోవటం కోసం తనకున్న పొలంలో ఎకరం అమ్మేసి కొన్ని అప్పులు తీర్చాడు.

ఉన్న రెండు ఎకరాల్లో మూడేళ్లుగా మొక్కజొన్న సాగుచేస్తున్నా అనుకున్నంత రాబడి రాకపోవటంతో.. ఇంతలో పంట కోసం చేసిన అప్పులతో పాటు.. కుటుంబంలో పెరిగిన ఆర్థిక భారం ఆయన్ను ఆత్మహత్యకు పురికొల్పేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వరకూ ఏదో రీతిలో డబ్బులు సంపాదించి.. అప్పులు తీర్చాలన్న ధోరణి మల్లేశంలో కనిపిస్తుంది.

వారం క్రితం రాజధాని చేరుకున్న అతను సెక్యూరిటీ గార్డుగా చేరాడు. ఏదో ఒక పని చేసి అప్పు తీర్చాలని భావించినా.. ఆ అశ వారం రోజుల్లోనే కొడగట్టింది. సెక్యూరిటీ గార్డుగా పని చూస్తే అప్పు చెల్లించటం సాధ్యం కాదనుకున్నాడో.. లేక.. అప్పులోళ్ల సూటిపోటీ మాటలు తట్టుకోలేకపోయాడో.. కష్టం వచ్చిన చేయి చాస్తే బంధువులు నో చెప్పటమో కానీ.. జీవితం మీద విరక్తి చెంది తనువు చాలించాడు. చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా మారాడు. అతని మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. మల్లేశం గురించి వివరాలన్నీ బయటకు వచ్చినా పోలీసులు మాత్రం ఆయన మరణాన్ని అన్నదాత ఆత్మహత్యగా మాత్రం కేసు నమోదు చేయలేకపోవటం ఏమిటో..? ఇక.. మల్లేశం అప్పుల సంగతి చూస్తే.. కొందరు రూ.6లక్షలు ఉన్నాయని చెబుతుంటే.. మరికొందరు రూ.3లక్షలకు పైనే ఉంటాయని చెబుతున్నారు. మరి రాజధాని పోలీసులు మల్లేశం ఆత్మహత్య కేసును ఎలా నడిపిస్తారో చూడాలి.