Begin typing your search above and press return to search.

అయోధ్య రామాలయ నిర్మాణంలో అవినీతి? రామజన్మభూమి ట్రస్టు వివరణ ఇదే

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 AM GMT
అయోధ్య రామాలయ నిర్మాణంలో అవినీతి? రామజన్మభూమి ట్రస్టు వివరణ ఇదే
X
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగటమే కాదు.. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న వైనం సంచలనంగా మారింది. అయోధ్యలో 12,080 చదరపు మీటర్ల భూమిని ఒక వ్యక్తి రూ.2కోట్లకు కొన్నారని..కొన్ని నిమిషాల వ్యవధిలోనే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రూ.18.5 కోట్లకు కొన్నట్లుగా ఆరోపించారు. ఈ ఆరోపణ పెను సంచలనంగా మారటమేకాదు.. కలకలాన్ని రేపింది.

ఈ అంశంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా వివరణ ఇచ్చింది. మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణను ఖండించింది. అసలేం జరిగిందంటే అంటూ పూర్తి వివరాల్ని వెల్లడిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులోని అంశాల్నిచూస్తే..

- రామాలయ నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలోని బాగ్‌ జైసీ గ్రామంలో రైల్వే స్టేషన్‌ సమీపంలో కొన్న 12,080 చదరపు మీటర్ల భూమి రోడ్డుకి పక్కనే ఉంటుంది. అంతేగాక, ఇక్కడ త్వరలోనే నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరగనుంది. రామ జన్మభూమి మందిరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం కానుంది.

- ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. మేం మార్కెట్‌ ధర కన్నా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేశాం. చదరపు అడుగుకు రూ.1,423 చొప్పున కొన్నాము. ఈ భూమికి సంబంధించి 2011 నుంచి చాలా మంది వ్యక్తుల మధ్య ఈ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయి.

- ఆ భూమి యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేదు. ముందుగా ఆ భూమి యాజమాన్య హక్కులు పూర్తిగా ఎవరికి చెందుతాయో ఖరారు చేయాల్సి ఉందని న్యాస్‌ భావించింది. రికార్డుల్ని పరిశీలిస్తే.. పదేళ్లుగా జరిగిన ఒప్పందాలన్నింటిలో మొత్తం తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. వారిలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు. మొత్తం తొమ్మిది మందితోనూ చర్చలు జరిపాం.

- వారంతా గత ఒప్పందాలన్నింటిపై చర్చించి భూ యాజమాన్య హక్కుల అంశంపై పరిష్కారం చూపుతూ తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో మార్చి 18న ఆ భూమిని కుసుమ్‌ పాఠక్‌, హరీశ్‌ పాఠక్‌ నుంచి రవి మోహన్‌ తీవారీ, సుల్తాన్‌ అన్సారీ కొన్నారు. ఇందుకు వారు రూ.2 కోట్ల కన్సిడరేషన్‌ మొత్తం పాటు సర్కిల్‌ రేట్‌ వాల్యుయేషన్‌కు రూ.5.80 కోట్లు, స్టాంపులకు రూ.5.80 కోట్లు ఖర్చు చేశారు.

- ఆ భూమిని రవి మోహన్‌ తివారీ, సుల్తాన్‌ అన్సారీ నుంచి కొనడానికి రూ.18.5 కోట్ల కన్సిడరేషన్‌ మొత్తానికి రామ జన్మభూమి ట్రస్టు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్సుగా రూ.17 కోట్లు ఇచ్చాం. వారితో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ట్రస్టు శరవేగంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, పూర్తి పారదర్శకంగానే వ్యవహరించింది.

- లావాదేవీలన్ని ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇప్పటికే మేం రామాలయ నిర్మాణానికి 3 -4 ప్లాట్లనుకొన్నాం. భవిష్యత్తులోనూ కొనుగోలు చేస్తాం.