Begin typing your search above and press return to search.

హనీమూన్ వెళ్లారు.. కరోనా సోకింది.. దాపెట్టిన తండ్రిపై కేసు

By:  Tupaki Desk   |   17 March 2020 5:30 AM GMT
హనీమూన్ వెళ్లారు.. కరోనా సోకింది.. దాపెట్టిన తండ్రిపై కేసు
X
కరోనా వైరస్ పై ప్రజల్లో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రిని సంప్రదించాలని లేకపోతే పోలీసులను కూడా సంప్రదించవచ్చని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి చెందిందని తెలిసినా పరువు కోసం.. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తండ్రి కప్పి పుచ్చేసి సైలెంట్ గా ఉన్నాడు. ఈ విషయం తెలిసీ చివరకు అతడి పై కేసు నమోదు చేసే స్థాయికి చేరింది. ఈ ఘటన మన దేశ రాజధానికి చేరువలో ఉన్న ఆగ్రాలో జరిగింది.

ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివసిస్తున్న ఓ మహిళకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఇటీవల వివాహమైంది. పెళ్లవడంతో హనీమూన్ కు ఇటలీకి వెళ్లొచ్చారు. అక్కడ గడిపి ఆగ్రాకు వచ్చారు. భర్త ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లగా ఆమె ఆగ్రాలోని తన తల్లిదండ్రులతో ఉంటోంది. భార్యా భర్తలు ఇద్దరు ఇటలీకి వెళ్లి వచ్చారని స్థానికులు గుర్తించారు. అయితే బెంగళూరులో ఉన్న భర్త కరోనా బారిన పడ్డాడు. అతడ్ని వెంటనే ప్రత్యేక వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సమయంలో అతడి ప్రయాణ వివరాలు పరిశీలించగా భార్య కూడా అతడి వెంట వెళ్లిందని గుర్తించారు. దీంతో అక్కడి అధికారులు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు ఆగ్రాలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న అమ్మాయిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వైద్యబృందానికి అమ్మాయి తండ్రి తప్పుడు వివరాలు చెప్పి ఇంట్లో లేదని చెప్పాడు. తన కూతురు ఇంట్లో లేదు.. బెంగళూరు వెళ్లిందని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన ఆ వైద్య అధికారులు ఇంట్లోకి వెళ్లారు.

బృందానికి అనుమానం వచ్చి ఇంట్లో గాలించగా యువతి ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ యువతి అనారోగ్యంతో బాధపడుతోంది. వెంటనే ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న కూతుర్ని దాచి పెట్టడానికి ప్రయత్నించడంతో తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ కరోనా సోకిందని తేలింది. హనీమూన్ వెళ్లొచ్చిన ఈ జంటకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. భర్తను బెంగళూరులో, భార్యను ఆగ్రాలో ప్రత్యేక వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులకు కూడా కరోనా సోకిందేమోనని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భం గా అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కూడా శాంపిల్స్ సేకరించి, కరోనా టెస్ట్ పరీక్షలకు పంపించారు.