Begin typing your search above and press return to search.

వామ్మో క‌రోనా..న‌డిసంద్రంలో ఓడ‌ను నిలిపేసి...

By:  Tupaki Desk   |   4 Feb 2020 2:04 PM GMT
వామ్మో క‌రోనా..న‌డిసంద్రంలో ఓడ‌ను నిలిపేసి...
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రేకెత్తిస్తున్న క‌ల‌క‌లం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కరోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 425కు చేరుకుంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తి ప్రపంచదేశాలకు ముప్పుగా మారినప్పుడు అంతర్జాతీయ సహకారం - సమన్వయం కోసం డబ్ల్యూహెచ్‌ వో గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అలాంటి ప‌రిస్థితి క‌లిగించిన ఈ వ్యాధి కార‌ణంగా ఓ ఓడ న‌డి సంద్రంలో చిక్కుకుంది.

ఇట‌లీలోని రోమ్ నగరానికి సమీపంలో వైర‌స్ భ‌యం కార‌ణంగా.... ఓడ 5 రోజులుగా సముద్రంలోనే నిలిచిపోయింది. ఆ షిప్‌లో చైనాకు చెందిన దంపతులు..జ్వరం - శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వారికి క‌రోనా వైర‌స్ ఉందేమో అనే అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. అందుకే షిప్ నిలిపివేసి... వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే స‌మ‌యంలో...ఆ ఓడలో ఉన్న 6 వేల మందిలో బయటకు అనుమతించడం లేదు. దీంతో అందులో ఉన్న జ‌నాలు అల్లాడిపోతున్నారు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంగోలియా - సింగపూర్.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఇటలీలో ఇద్దరికి వైరస్ సోకడంతో ఆ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాగా, బ్రిటన్‌ లోనూ ఇద్దరికి వైరస్ సోకింది. ఇలాంటి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్న త‌రుణంలో... ఈ మ‌హమ్మారికి మూల‌మైన చైనా మాత్రం ఢాంబికాల‌కు పోతోంది. కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. ప్రపంచ దేశాలు బాధ్యతగా వ్యహరించాలని సూచించింది. అతిగా స్పందించడం మానుకోవాలని, దీని వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.