Begin typing your search above and press return to search.

కరోనా విజృంభణ :దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు!

By:  Tupaki Desk   |   9 April 2020 12:30 PM GMT
కరోనా విజృంభణ :దేశంలో 6 వేలు దాటిన కరోనా కేసులు!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి ప్రస్తుతం 208 దేశాలకు విస్తరించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్..దాదాపుగా అన్ని ఖండాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఈ కరోనాకి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో .. కరోనా కట్టడికి పలు దేశాలు లాక్‌ డౌన్ విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

ఇకపోతే , తాజాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. మొత్తం 6237కి కరోనా సోకింది. 186 మంది చనిపోయారు. 569 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 163 మందికి కరోనా సోకగా ఒక్క ముంబైలోనే 143 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 72 మంది చనిపోయారు.

ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ కేసులు పెద్ద సంఖ్యలో నిర్ధారణ అయ్యే ప్రాంతాలను కంటెయిన్‌ మెంట్ జోన్లగా పరిగణించి - మహమ్మారి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతున్నారు. అలాగే కరోనాను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ...ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. అయితే , దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు దీనిని పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగానే తాము లాక్‌ డౌన్ కొనసాగిస్తామని నిర్ణయించాయి.