Begin typing your search above and press return to search.

కరోనా ఫ్రీ దిశగా తెలంగాణ అడుగులు వేస్తుందా?

By:  Tupaki Desk   |   28 April 2020 3:45 AM GMT
కరోనా ఫ్రీ దిశగా తెలంగాణ అడుగులు వేస్తుందా?
X
కరోనా ఎంట్రీ ఇచ్చి తానేమిటో ప్రపంచానికి చూపిస్తున్న వేళలోనే.. తెలుగు ప్రజలకు దాని తీవ్రత ఎంతన్న విషయం అర్థమైంది. ప్రభుత్వాలు చెప్పినట్లుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనా.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటివారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ ఉన్నారు. ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్నది మర్చిపోకూడదు. కరోనా కేసులు షురూ అయి.. తీవ్రత పెరిగిన తర్వాత.. ఒక రోజులో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కావటం ఆసక్తికరంగా మారింది.

ఒక్కరోజులో తొంభైకి పైగా కేసులు నమోదైన ఉదంతాలు లేకపోలేదు. నెమ్మదిగా మొదలైన కరోనా ప్రయాణం.. ఒకదశలో దూకుడుగా సాగింది. చూస్తుండగానే వంద నుంచి ఐదు వందలకు.. అంతలోనే తొమ్మిది వందలకు చేరుకుంది. వెయ్యిని క్రాస్ చేసేందుకు ఎక్కువ రోజులే పట్టింది. అనూహ్యంగా వెయ్యి దాటే క్రమంలో పాజిటివ్ కేసుల స్పీడ్ తగ్గటమే కాదు.. సోమవారం ఏకంగా రెండింటికే పరిమితం కావటంతో కొత్త హోప్ వచ్చినట్లైంది.

చిత్రమైన విషయం ఏమంటే.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గటం లేదు. మరణాల రేటు పెరుగుతోంది. అందుకు భిన్నమైన వాతావరణం తెలంగాణలో ఉండటం గమనార్హం. మొన్నటివరకూ నిత్యం డబుల్ డిజిట్ లో ఉండే కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు సింగిల్ డిజిట్ లోకి రావటమే కాదు.. రెండు కేసులకు పరిమితం కావటంతో కొత్త చర్చ మొదలైంది. కరోనాను తెలంగాణ జయించినట్లేనన్న వ్యాఖ్యల్ని కొందరు చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే కరోనా ఫ్రీ దిశగా తెలంగాణ అడుగులు వేయటం ఖాయమన్న మాటా పలువురి నోట వినిపిస్తోంది.

ఇలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేసే వారు కొన్ని చేదు నిజాల్ని మర్చిపోకూడదు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. అదే సమయంలో.. ఎక్కువ నిర్దారణ పరీక్షలు జరగటం లేదన్న కఠిన నిజాన్ని మరవకూడదు. పరీక్షలు చేయనంత మాత్రాన.. రోగ లక్షణాలు ఉంటే బయటకు రాకుండా ఉంటాయా? అన్న క్వశ్చన్ లోని హేతుబద్ధతను కాదనలేం. కాకుంటే.. కరోనా వచ్చినా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. ఆటోమేటిక్ గా దాన్ని అధిగమించొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.

రోగం ఉంటే దాన్ని దాచటం సాధ్యం కాదు. కరోనా లాంటి దాన్ని అస్సలు కవర్ చేయలేమన్నది మర్చిపోకూడదు. కరోనా మూలాలు తెలంగాణలో లేవన్న పెద్ద మాటల్ని అనలేం కానీ.. కంట్రోల్ చేసే స్థాయిలో ఉందని మాత్రం చెప్పేయొచ్చు. పాజిటివ్ కేసులు వెలుగు చూసినంతనే ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసినట్లుగా.. కంటైన్మెంట్ జోన్ గా డిక్లేర్ చేసి.. కనీసం రెండు వారాల పాటు బయటకు రాకుండా చూడటంలో ప్రభుత్వ విజయం సాధించింది.
ఇదే కరోనాను కట్టడి చేయగలమన్న సంకేతాల్ని ఇస్తుందని చెప్పక తప్పదు. సోమవారం రెండు కేసులు మాత్రమే నమోదు కావటం శుభసూచకమే తప్ప.. శుభం కార్డు పడ్డట్లు కాదన్నది మర్చిపోకూడదు. కరోనా అన్నది సుదీర్ఘంగా సాగే పోరు. అందులో విజయాన్ని సాధించటం అంత తేలిక కాదు. సంతోషంతో శత్రువును తక్కువ అంచనా వేయకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే అంతిమంగా విజయం వరిస్తుందన్న వాస్తవాన్ని అస్సలు మర్చిపోకూడదు.