Begin typing your search above and press return to search.

కరోనా రోగులు ఆ సీఎం ఇంటి చుట్టూ తిరిగారట

By:  Tupaki Desk   |   30 March 2020 4:00 AM GMT
కరోనా రోగులు ఆ సీఎం ఇంటి చుట్టూ తిరిగారట
X
షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఇద్దరు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి చుట్టూ తిరిగిన వైనాన్ని గుర్తించారు. దీంతో.. అధికారులు పెద్ద ఎత్తున చర్యల్ని తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి యడ్డి నివాసం ఉంటుందన్న డాలర్స్ కాలనీలో ఈ ఇద్దరు అటుగా తిరగటంతో కలకలం రేగుతోంది.

విదేశాల నుంచి వచ్చిన పీ25 రోగితో పాటు.. వారి ఇంట్లో పని చేసే మహిళ పీ 59కు కరోనా సోకినట్లుగా తాజాగా అధికార ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే.. ఈ రెండు పాజిటివ్ కేసుల్ని నగరంలోని ఒక ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స చేయిస్తున్నారు. పీ 25కు తొలుత కరోనా పాజిటివ్ రాగా.. వారింట్లో పని చేసే పనిమనిషికి తాజాగా పాజిటివ్ అని తేలింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. సీఎం నివాసం చుట్టూ బందోబస్తును పెంచటమే కాదు.. మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా పాజిటివ్ అని తేలిన పీ59 మహిళ డాలర్స్ కాలనీలోని నాలుగు ఇళ్లల్లోనూ పని చేస్తోంది. కరోనా సోకిన నేపథ్యం లో ఆ నాలుగు ఇళ్లల్లోని వారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వటం లేదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలతో ఉలిక్కి పడిన పోలీసులు.. సీఎం నివాసం ఉండే డాలర్స్ కాలనీలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.