Begin typing your search above and press return to search.

కరోనా మరణాల్లో చైనాను దాటేయనున్న ఆ చిన్ని దేశం!

By:  Tupaki Desk   |   17 March 2020 4:00 AM GMT
కరోనా మరణాల్లో చైనాను దాటేయనున్న ఆ చిన్ని దేశం!
X
కరోనా వైరస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైనాలోని వూహాన్ మహానగరంలో మొదలైన ఈ మహమ్మారి మూడు నెలలు తిరిగేసరికి ప్రపంచం మొత్తాన్ని చుట్టేయటమే కాదు.. భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా మొదలై.. ఒక్కసారి బద్ధలయ్యే చందాన్ని గుర్తుకు తెస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలు ఇలాంటి విషమ పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అంత పెద్ద చైనాలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించటంలో డ్రాగన్ దేశం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినప్పటికీ.. వైరస్ వ్యాప్తిని నిలువరించిందని చెప్పాలి.

ఈ విషయంలో యూరోపియన్ దేశాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల మరణాలు చోటు చేసుకున్నాయి. చైనాలో వేలాది మందికి కరోనా సోకినా.. మరణాల సంఖ్యను కనిష్ఠ స్థాయిలో ఉంచటం లో ఆ దేశం తీవ్రంగా శ్రమించింది. తాజాగా ఇటలీ లాంటి చిన్న దేశంలో కరోనా ధాటికి అక్కడి ప్రజలు పిట్టల మాదిరి చనిపోతున్నారు. చైనాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 3213 మంది మరణిస్తే.. ఇటలీలో అతి తక్కువ సమయంలో మరణించిన వారి సంఖ్య 2158 కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీ తర్వాత అంతే ఆందోళనను కలిగిస్తున్న దేశంగా ఇరాన్ ను చెప్పాలి. ఇప్పుడా దేశంలో కరోనా బారిన పడి 853 మంది ప్రాణాలు విడిచారు.

కరోనా వైరస్ వ్యాప్తి అంచనాలకు మించినట్లుగా ఉంటోంది. దీనికి పలు ఉదాహరణల్ని చూపిస్తున్నారు. ఫ్రాన్స్ లో తొలివారం పన్నెండుగా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నాలుగో వారానికి వచ్చేసరికి ఏకంగా 4500కు పెరగ్గా.. ఇరాన్ లో ఈ సంఖ్య 12,700కు పెరిగింది. ఇటలీ మరింత ముందుకెళ్లింది. ఈ దేశంలో 24 వేల మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరింత షాకింగ్ గా స్పెయిన్ లో కేవలం నాలుగు వారాల్లో ఎనిమిది పాజిటివ్ కేసులు కాస్తా.. ఇప్పుడు ఆరు వేల కేసులకు పెరగటం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇదంతా చూస్తున్నప్పుడు భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన దేశాల్లో కరోనా వ్యాప్తిని చూస్తున్న వేళ.. భారత్ లో అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా చూడాలంటే.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.