Begin typing your search above and press return to search.

కరోనాను చైనా అధిగమిస్తోందా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 6:30 PM GMT
కరోనాను చైనా అధిగమిస్తోందా?
X
పిట్టల మాదిరి కరోనా వైరస్ పిశాచి దెబ్బకు రాలిపోయిన చైనీయుల వైనం ప్రపంచ దేశాలకు ఎంత వణుకు పుట్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మందికి కరోనా వైరస్ సోకటంతో.. చైనాలోని పలు నగరాల్ని సీల్ చేసేసి.. ఆ నగరంలో నుంచి బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. వెయ్యి.. పదిహేను వందల బెడ్లు ఉన్న ఆసుపత్రుల్ని కేవలం తొమ్మిది రోజుల్లో ఒకటి.. పదిహేను రోజుల్లో మరొకటి పూర్తి చేసి ప్రపంచానికే కొత్త స్ఫూర్తినిచ్చింది చైనా. అంతేకాదు.. కరోనా పిశాచిని ఎదుర్కొనేందుకు తన శక్తినంతా ప్రదర్శించింది చైనా.

ఇప్పటికి కరోనా వైరస్ బారి నుంచి ఆ దేశం బయటపడలేదు. కాకుంటే.. మహమ్మారిని జయించటం తమకు సాధ్యమేనన్న విషయాన్ని తాజాగా ఫ్రూవ్ చేసుకుందని చెప్పాలి. కరోనా వైరస్ కు కేంద్రస్థానమైన వూహాన్ లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. కరోనా కారణంగా ఎక్కువ మంది మరణించింది కూడా ఆ నగరంలోనే. కరోనా కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది వందలకు పైగా ప్రజలు మరణిస్తే.. దీని బారిన పడిన వారి సంఖ్య నలభై వేలుగా చెబుతున్నారు. లక్షలాది మంది ఈ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు.

రోజులు గడుస్తున్నా.. కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే విషయంలో కిందామీదా పడుతున్న వైద్యులకు.. తాజాగా ఒక ఆశారేఖ కనిపించిందని చెప్పాలి. కరోనా వైరస్ బారిన పడి పద్నాలుగు రోజుల చికిత్స అనంతరం.. ఆ వైరస్ ను జయించిన వారు దగ్గర దగ్గర అరువందల వరకూ చేరినట్లు గా చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా ఈ పిశాచి తో పోరాటం చేసి.. దాన్ని జయించిన వారి ఉదంతాలు చైనీయులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.