Begin typing your search above and press return to search.

చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా పిశాచి

By:  Tupaki Desk   |   3 Feb 2020 6:10 AM GMT
చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా పిశాచి
X
వారం నుంచి చాలామంది వాట్సాప్ లకు ఒక సందేశం వచ్చింది. వైరల్ గా మారిన ఈ పోస్టులో పోతులూరి వీరబ్రహ్మం అప్పుడెప్పుడో.. కరోనా గురించి చెప్పటమే కాదు.. భారీ ఎత్తున దాని ధాటికి ప్రాణాలు కోల్పోతారని ఉండటం ఆసక్తినే కాదు భయాందోళనల్ని కలిగించింది కూడా. దీనికి తగ్గట్లే.. రోజులు గడుస్తున్నా కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను కనుగొనకపోవటంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

చైనా ప్రభుత్వం చేసిన తప్పులకు.. కరోనా విషయంలో మొదట్లో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఇప్పుడు భారీ మూల్యాన్నిచెల్లించాల్సి వస్తోంది. చివరకు చైనా అధినేత సైతం కరోనాను పిశాచి తో పోల్చి.. దానితో పోరాడుతున్నామని చెప్పటం ద్వారా.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని ఆయన చెప్పేశారు. రోజు గడిచే కొద్దీ వైరస్ బారిన కొత్తగా పడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగి పోవటం.. మరణాల సంఖ్య పెరుగుతూ ఆందోళనల్ని కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఒక్క ఆదివారంనాడే చైనాలో 57 మంది కరోనా కారణం గా మరణించారు. దీంతో ఈ మాయదారి వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 361కు చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే ఒక్క రోజులోనే 2829 కొత్త కేసులు నమోదు కావటం చూస్తే.. చైనాలో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

కొంతలో కొంత సానుకూల సందేశం ఏమైనా ఉందంటే.. ఈ వైరస్ నుంచి 475 మంది కోలుకున్నట్లుగా చెబుతున్నారు. కరోనా బారిన పడి.. తమ రోగ నిరోధక శక్తితో ఆ వైరస్ దాడి నుంచి తట్టుకొని సేవ్ అయినట్లుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. ఇప్పటి లెక్కల ప్రకారం చైనాలో1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. రికార్డు స్థాయిలో కేవలం వారం వ్యవధిలో వూహాన్ లో నిర్మించిన అతి పెద్ద వెయ్యి పడకల ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది.

భారత్ విషయానికి వస్తే ఇప్పటికే కేరళ లో ఒక కేసు వెలుగు చూడగా.. తాజాగా మరో కేసు కేరళలోనే బయటకు వచ్చింది. దీంతో.. చైనా ప్రయాణాల్ని వెంటనే ఆపేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు.. చైనా నుంచి భారత్ కు వచ్చే వారిని తప్పని సరిగా వైద్యుల పర్యవేక్షణ లో ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుందని చెప్పక తప్పదు.