Begin typing your search above and press return to search.

అమెరికాలో మరణ మృదంగం: ఒక్కరోజే 1169మంది బలి

By:  Tupaki Desk   |   3 April 2020 10:11 AM IST
అమెరికాలో మరణ మృదంగం: ఒక్కరోజే 1169మంది బలి
X
అమెరికాలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యం అల్లకల్లోలంగా మారింది. కనీవినీ ఎరుగని మానవ విధ్వంసం చోటుచేసుకుంటోంది. అమెరికాలో మరణ విలయమే కొనసాగుతోంది. వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అమెరికాలో ఏకంగా 1169మంది కరోనాకు బలి అయిపోయారు. ఒక్కరోజే 1000కి పైగా మరణాలు ప్రపంచం లో ఏ దేశంలోనూ నమోదు కాక పోవడంతో అమెరికాలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.

అమెరికా వ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్ రాష్ట్రాల్లో అయిదంకెల కేసులు దాటేశాయి.

ఒక్క న్యూయార్క్ లోనే 93వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ లోనే లక్ష కేసులు దాటడం ఖాయంగా కనిపిస్తున్నాయి. న్యూయార్క్ లోనే కరోనా బారిన పడి 2538మంది మరణించారు. అత్యధిక కరోనా మరణాలు సంభవించిన రాష్ట్రం ఇదే కావడం గమనార్హం.

న్యూజెర్సీలోనూ 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 537మంది మరణించారు. కాలిఫోర్నియాలో 11వేల కేసులు, మిచిగాన్ లో 10వేల కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. లుసియానా, ఫ్లోరిడా, మాసాచుసెట్స్, ఇల్లినాయాస్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

అమెరికా అంచనావేసినట్టు ఆ దేశంలో 2.50 లక్షల మంది మరణించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు దాటేసింది.