Begin typing your search above and press return to search.

అమెరికాలో మరణమృదంగం ఎంత భారీనో తెలుసా?

By:  Tupaki Desk   |   30 March 2020 6:45 AM GMT
అమెరికాలో మరణమృదంగం ఎంత భారీనో తెలుసా?
X
కత్తి పట్టిన కరోనా ప్రపంచంలోని దేశాలన్నింటితోనూ వీర విహారం చేస్తుందని చెప్పాలి. మిగిలిన దేశాల్లో సదరు పిశాచి వైరస్ వేసే వీరంగంతో పోల్చినప్పుడు భారత్ తో దాని తీవ్రత చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచానికి పెద్దన్న అమెరికా ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు తో పోట్లాడలేక చతికిల పడటమే కాదు.. రానున్న రెండు వారాల వ్యవధిలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోనున్న వైనం భీతి కలిగించేదిగా మారింది.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలమన్న భావన మొదట్లో ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. దాని తీవ్రత ముందు అమెరికన్ల నిలవలేకపోతున్నారు. కేవలం రెండంటే రెండు రోజుల వ్యవధిలో ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షనాలుగు వేల నుంచి 1.42లక్షల కుచేరుకున్నాయి. అంటే.. రెండు రోజుల్లో పెరిగిన కేసులు 38వేలకు పైనే. అదే సమయంలో ఇప్పటివరకూ కరోనా కారణం గా మరణించిన వారి సంఖ్య 2493గా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన ఆంక్షల గడువు ఈ రోజు (సోమవారం)తో ముగిసింది. ఇలాంటివేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇప్పుడున్న ఆంక్షల్ని మరో నెల పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్లు సామాజిక దూరం పాటిస్తారని.. దాంతో పరిస్థితి మామూలు స్థితికి చేరుకుంటుందని భావించారు. కానీ.. అలాంటిదేమీ లేదన్నది ఇప్పుడుచోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

దీంతో.. ఆంక్షల్ని మరింతపెంచాలని డిసైడ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికాలో కరోనా కత్తికి లక్ష మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు వారాల వ్యవధిలో ఇంత భారీగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉన్నట్లుగా ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ ఫాసీ లెక్క కట్టారు. కరోనా కారణంగా అమెరికాలో మరణించే వారి సంఖ్య రెండు లక్షల వరకూ ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని ట్రంప్ సర్కారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత వేసిన అంచనాల ప్రకారం ఈస్టర్ పర్వదినం నాటికి అంతా సర్దుకుంటుందని భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి కళ ఏమీ కనిపించక పోగా.. కరోనా ఉత్పాతం నుంచి ఎప్పటికి బయటపడతామా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.