Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా ... గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ !

By:  Tupaki Desk   |   10 Aug 2021 11:30 AM GMT
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా ...  గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ !
X
మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందట. దీంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నందున డాక్టర్ల సలహాలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే.కొద్ది వారాల క్రితం తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండ్రోజుల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన చేరిన సంగతి తెలిసిందే. నల్గొండ‌లోని ఎన్‌ జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’ వేదికగా బహుజన్ సమాజ్ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ఆర్ ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు. ఐపీఎస్‌ కు రాజీనామా చేసిన తర్వాత పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే తాను కూడా పోరాటం చేస్తానని ప్రవీణ్ కుమార్ ఇదివరకే స్పష్టం చేశారు.

అంతకుముందు ప్రవీణ్ కుమార్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి సహా వివిధ ప్రాంతాలు పర్యటించారు. తాను రాజీనామా చేసిన నాటి నుంచి వివిధ జిల్లాలు పర్యటించారు. ఆ సమయంలోనే తన రాజకీయ కార్యాచరణను ప్రవీణ్ కుమార్ ప్రాథమికంగా ప్రకటించారు. తర్వాత స్వైరో కార్యకర్తలు పది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లెపల్లెన తిరుగుతూ నల్గొండ సభకు జన సమీకరణ చేపట్టారు. మొదట నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించాక, అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ర్యాలీగా వచ్చారు.

రాజ్యాధికారం వస్తే తన సుఖాల కోసం ప్రజలను మోసం చేయనని ప్రవీణ్ కుమార్ గతంలోనే చెప్పారు. తనకు ఒక బెడ్ రూమ్, బాత్ రూమ్ ఉంటే చాలని, ప్రజలు తన కన్నా గొప్పగా జీవించేలా చూడటమే తన లక్ష్యమని చాలా సందర్భాల్లో చెప్పారు. అన్ని రంగాల్లో వారికి గొప్ప అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, బహుజన వాదంతో వారందరినీ రాజ్యాధికారం వైపు నడిపిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన వెంట లక్షలాది మంది బహుజన బిడ్డలు ఉన్నారని చెప్పారు. కాగా, గత కొద్దిరోజులుగా ఆయనతో సన్నితంగా ఉన్నవారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.