Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా పొలిటికల్ ట్రెండ్ స్టార్ట్

By:  Tupaki Desk   |   18 Jun 2020 3:30 AM GMT
దేశంలో కరోనా పొలిటికల్ ట్రెండ్ స్టార్ట్
X
కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇటీవల నేతలు కూడా చనిపోతున్నట్లుగా వింటూనే ఉన్నాం. వారం క్రితం డీఎంకే ఎమ్మెల్యే ఒకరు ఈ వైరస్ కారణంగామృత్యువాత పడ్డారు. తాజాగా మరో మాజీ ఎంపీ, తమిళనాడు ముఖ్యమంత్రి పీఏ తదితరులు చనిపోయారు. దీంతో నాయకులకు కరోనా భయం పట్టుకుంది.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు 3.60 లక్షలకు చేరుకున్నాయి. మరణాలు 12వేలు దాటాయి. మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదున్నరవేల మందికి పైగా చనిపోయారు. తాజాగా, కరోనా కారణంగా ముంబైకి చెందిన బీజేపీ మాజీ ఎంపీ హరిభావ్ జావలే మృతి చెందారు. జల్‌గావ్‌కు చెందిన ఆయన ఈ నెల ప్రారంభంలో కరోనా బారినపడ్డారు. ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడటంతో వెంటిలెటర్ అమర్చేలోపు మృతి చెందారు.

తమిళనాడులో అయితే సీఎంవో కార్యాలయానికే కరోనా భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్ కరోనా కారణంగా బుధవారం మృతి చెందాడు. రాష్ట్రంలో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇందులో చెన్నై కేసులో 90 శాతం వరకు ఉంటున్నాయి. గత నాలుగు రోజులుగా మరణాలు కూడా 30 నుండి 49 మధ్య ఉంది.

ఢిల్లీలో కూడా కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో ఆయనకు తొలుత నెగిటివ్ అని తేలింది. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నారు.

ఇక తెలంగాణ లో పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా కొందరు ఎమ్మెల్యేలు కొంతకాలం కనిపించకుండా పోయారు. ఇద్దరు కరోనా బారిన పడి రహస్యంగా చికిత్స చేయించుకుని కోలుకున్నారని సమాచారం.