Begin typing your search above and press return to search.

ఏపీ రాజ్‌ భవన్‌ లో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   30 July 2020 9:15 AM IST
ఏపీ రాజ్‌ భవన్‌ లో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్ !
X
ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ ‌లో మళ్లీ కరోనా కలకలం రేగింది. రాజ్ భవన్ లో పనిచేస్తున్న మరో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అక్కడ మొత్తం 72 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. అందులో 15 మంది తాజాగా కరోనా భారిన పడ్డారు. ఒకేసారి ఇంత మొత్తంలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అలాగే పూర్తిగా రాజ్‌భవన్‌ను శానిటైజ్‌ చేయించారు.

గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ 15 మందికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలంరేపుతోంది. గతంలో కూడా రాజ్‌భవన్‌ లో పనిచేసేవారికి, భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు.

కాగా,ఏపీలో బుధవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేని విదంగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 70,584 నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 65 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. అలాగే, ఇప్పటివరకూ మొత్తం 55,406 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.