Begin typing your search above and press return to search.

కరోనా కలకలం: ఒకే కాలేజీలో 39మందికి కరోనా

By:  Tupaki Desk   |   5 Dec 2021 9:00 PM IST
కరోనా కలకలం: ఒకే కాలేజీలో 39మందికి కరోనా
X
కరోనా కోరలు చాస్తోంది. క్రమంగా కేసులు మళ్లీ ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీలు, గురుకులాల్లో పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది.

కరీంనగర్ లోని ఈ మెడికల్ కాలేజీలో 39మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం కాలేజీకి సెలవులు ప్రకటించింది. మిగతా విద్యార్థులందరికీ టెస్టులు చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ముత్తంగి గురుకులాలతోపాటు ఖమ్మం జిల్లా వైరాలో కూడా విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపింది. కాలేజీలు, గురుకులాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ థర్డ్ వేవ్ దిశగా సాగుతోందా? అన్న భయాలు వెంటాడుతున్నాయి.

ఇంతకుముందు కూడా కర్ణాటకలో ఇలానే ఓ వైద్య కళాశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. దార్వాడ్ లోని ఎస్డీఎం కాలేజీలో 281మందికి కరోనా సోకడం సంచలనం కలిగించింది. అక్కడ కూడా మెడికల్ కాలేజీకి సెలవులు ప్రకటించారు. విద్యార్థులందరికీ కరోనా టెస్టులు చేశారు.