Begin typing your search above and press return to search.

2వేల కోట్ల నోట్ల కంటైన‌ర్ రోడ్డు మీద ఆగింది

By:  Tupaki Desk   |   27 Oct 2018 5:14 AM GMT
2వేల కోట్ల నోట్ల కంటైన‌ర్ రోడ్డు మీద ఆగింది
X
చాలా ఏళ్ల క్రితం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో దొంగ.. దొంగ అన్న సినిమా వ‌చ్చింది. తిరుడా.. తిరుడా అన్న త‌మిళ మూవీకి తెలుగు డ‌బ్బింగ్ ఈ దొంగ‌.. దొంగ‌. పెద్ద‌గా ఆడ‌ని ఈ సినిమాలో రూ.100 కోట్ల కొత్త నోట్ల లారీ చోరీ జ‌రుగుతుంది. అది రీల్ సీన్‌. అప్ప‌ట్లో రూ.100కోట్లు అంటే వామ్మో అనుకునే మొత్తం. ఈ సినిమా చూసినోళ్ల‌కు రూ.100కోట్ల మొత్తాన్ని లారీలో త‌ర‌లిస్తారా? త‌ర‌లించినా.. సెక్యురిటీ అంత సింఫుల్ గా ఉంటుందా? ఇట్టే చోరీ చేసేయొచ్చా? అన్న సందేహాలు క‌లిగాయి.

ఆ సినిమాలో రూ.100కోట్లే. కానీ.. తాజా ఘ‌ట‌న‌లో ఏకంగా రూ.2వేల కోట్లు. రెండు వేల రూపాయిల నోట్లున్న క‌ట్ట‌ల కంటైన‌ర్ ఒక‌టి రోడ్డు మీద ప్ర‌యాణిస్తూ మ‌ధ్య‌లో మొరాయించింది. ఇంత భారీ మొత్తంతో ఉన్న లారీ ఆగిపోతే ఏమ‌వుతుంది? అన్న సందేహం అక్క‌ర్లేదు.

ఎందుకంటే రీల్ లో మాదిరి రియ‌ల్ దోచేసుకోవ‌టం సాధ్యం కాదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆగిన లారీకి ముందు మ‌రో రెండు కంటైన్లు ఉన్నాయి. ఒక్కో కంటైన‌ర్లో రూ.2వేల కోట్లు చొప్పున నోట్ల క‌ట్ట‌లు ఉన్నాయి. మొత్తం రూ.6వేల కోట్ల విలువైన క‌రెన్సీతో చెన్నై రిజ‌ర్వ్ బ్యాంకు వెళుతున్న కంటైనర్ల‌లో చివ‌రి దానిలో తేడా వ‌చ్చి రోడ్డు మీద ఆగిపోయింది.

అంతే.. నిమిషాల్లో భ‌ద్ర‌తా సిబ్బంది పెద్ద ఎత్తున కంటైన‌ర్ వ‌ద్ద‌కు వాలారు. కంటికి రెప్ప‌లా సెక్యురిటీ ఇచ్చారు. మ‌రోవైపు.. లారీ ఎందుకు మొరాయించిందో చెక్ చేసి.. దాన్ని మ‌ర‌మ్మ‌తులు చేసి ఓకే చేశారు.

కాకుంటే ఈ మొత్తం ఎపిసోడ్‌లో నోట్ల క‌ట్ట‌లున్న కంటైన‌ర్ క్షేమంగా చెన్నై రిజ‌ర్వ్ బ్యాంక్ చేరే వ‌ర‌కూ ఉన్న‌తాధికారులు పిచ్చ టెన్ష‌న్ తో ఉండిపోయార‌ట‌. క‌ర్ణాట‌కలోని మైసూర్ నుంచి చెన్నై రిజ‌ర్వ్ బ్యాంకుకు మొత్తం రూ.6వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయిల బండిల్స్ మూడు కంటైన‌ర్ల‌లో స్టార్ట్ అయ్యాయి. ఈ మూడు లారీల్లో ఇంత భారీ మొత్తం ఉంద‌న్న విష‌యం త‌క్కువ మంది ఉన్న‌తాధికారుల‌కే తెలుసు. కాకుంటే గురువారం రాత్రి 11 గంట‌ల వేళ‌లో అమింజిక‌రై వ‌ద్ద పూంద‌మ‌ల్లి రోడ్డు మీద లారీ ఆగితే.. క్ష‌ణాల్లో స్థానిక పోలీసులు స్పందించి సెక్యురిటీ క‌ల్పించ‌ట‌మే కాదు.. ఆఘ‌మేఘాల మీద మెకానిక్ ను తీసుకొచ్చారు. కాకుంటే.. రెండు గంట‌ల పాటు.. ఆ రోడ్డు మీదుగా ఎలాంటి వాహ‌నాన్ని రానివ్వ‌లేదు. దీంతో.. వాహ‌న‌దారులు ఇబ్బంది ప‌డ్డారు. రూ.2వేల కోట్ల‌తో పోల్చిన‌ప్పుడు వాహ‌న‌దారుల క‌ష్టం పెద్ద క‌ష్టం కాద‌ని చెప్ప‌క త‌ప్పదు.