Begin typing your search above and press return to search.

వెంటాడి మరీ కానిస్టేబుల్ హత్య.. నంద్యాలలో రౌడీషీటర్ల బరితెగింపు

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:30 PM GMT
వెంటాడి మరీ కానిస్టేబుల్ హత్య.. నంద్యాలలో రౌడీషీటర్ల బరితెగింపు
X
షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. ఈ దారుణ హత్య ఉదంతం గురించి విన్న తర్వాత ఏపీ బిహార్ గా మారిందా? అన్న సందేహం కలుగక మానదు. నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీషీటర్లు బరితెగించిన వైనం చూస్తే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంటూ ఒకటి ఉందా? మరీ ఇంతలా నీర్వీర్యం అయిపోయిందా? ఒక కానిస్టేబుల్ ను నడి రోడ్డు మీద వెంటాడి వేటాడి మరీ దారుణంగా హత్య చేయటమా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారింది. కానిస్టేబుల్ మర్డర్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒకటి బయటకు రావటంతో జరిగిన ఉదంతంపై మరింత స్పష్టత వచ్చినట్లైంది.

తాజాగా వెలుగు చూసిన సీసీ కెమేరా పుటేజ్ చూస్తే.. ఆదివారం అర్థరాత్రి వేళ మద్యం తాగుతున్న రౌడీ షీటర్లకు 35 ఏళ్ల కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ కనిపించాడు. ఆ వెంటనే వారు అతనితో గొడవకు దిగారు.

మాట్లాడుతుండగానే తమ వద్ద ఉన్న బీరు సీసాలతో సురేంద్ర తలపై దాడి చేశారు. రౌడీ గ్యాంగ్ ఆరుగురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోవటానికి సురేంద్ర .. నంద్యాల పట్టణంలోని పద్మావతి సర్కిల్ వైపు పరుగులు తీశారు.

నిందితులు అతడ్ని వెంటపడి పట్టుకొన్నారు. పక్కనే ఉన్న ఆటోలో ఎక్కించారు. ఆటో డ్రైవర్ ను కొట్టి.. అతని మెడపై కత్తి పెట్టి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలటంతో సురేందర్ అప్పటికే స్ప్రహ కోల్పోయాడు.

అతడి గుండెలో.. వీపుపైనా విచక్షణరహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం ఆరుగురులో ముగ్గురు పరారు కాగా.. మరో ఇద్దరు నంద్యాల పట్టణంలోకి వచ్చి బుల్లెట్ వాహనం మీద వెళుతున్న వారిని కొట్టి వారి వాహనాల్ని తీసుకొని పరారయ్యారు.

నంద్యాల డీఎస్పీ ఆఫీసులో క్లర్క్ గా పని చేస్తున్న కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీంలను నియమించారు. నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ ను వెంటాడి మరీ హత్య చేసిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.