Begin typing your search above and press return to search.

ఈవీఎంల‌ హ్యాకింగ్‌ కు మోడీ ఇచ్చిన ట్విస్ట్ ఇది

By:  Tupaki Desk   |   12 Dec 2017 8:45 AM GMT
ఈవీఎంల‌ హ్యాకింగ్‌ కు మోడీ ఇచ్చిన ట్విస్ట్ ఇది
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను మ‌రింత‌గా హీటెక్కిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా చేసుకుని సోమవారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోడీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ ‘బ్లూవేల్’ చాలెంజ్‌ లో ఇరుక్కుపోయిందని అన్నారు. ఈనెల 18న వెల్లడయ్యే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ పరిస్థితి ఆ పార్టీకి స్పష్టమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సార‌థి రాహుల్‌ కు పేదరికం అంటే ఏమిటో తెలియదని, ఆయన మొదటి నుంచీ కూడా ఎలాంటి కష్టం తెలియని జీవితాన్ని అనుభవించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొందరు పారిశ్రామికవేత్తల కోసమే తాను పనిచేస్తున్నాన్న రాహుల్ విమర్శలను తిప్పికొట్టిన మోడీ గుజరాత్‌ కు సంబంధించి రాహుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనన్నారు. ఈ రకమైన పసలేని ఆరోపణలు చేయడం ద్వారా గుజరాత్ ప్రజల తెలివితేటలనే ఆయన అవమానిస్తున్నారని తెలిపారు.

గుజ‌రాత్ తొలి దశ ఎన్నికల్లో బీజేపీదే విజయం అన్న బలమైన సంకేతాలు వచ్చాయని అందుకే రాహుల్‌ ను సమర్ధించుకుంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్న మోడీ దీన్ని కూడా హ్యాక్ చేస్తున్నారంటూ బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంలను ఏ విధంగానూ ట్యాంపర్ చేయడానికి వీల్లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. తాజాగా బ్లూటూట్ బ్లూటూత్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కానీ‘ ఆడేవారి అంతం చూసే బ్లూవెల్ గేమ్‌ లోనే చిక్కుకుపోయిన విషయం కాంగ్రెస్‌ కు తెలియడం లేదు’అని వ్యంగ్యోక్తి విసిరారు. ఈనెల 18న ఈ ఆట చివరి అంకం ప్రసారం అవుతుందని మోడీ వెల్లడించారు.

కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టిన ఓ నాయకుడు రాత్రింబవళ్లూ తననే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్న మోడీ‘మీ కళ్లముందే 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాను. నేను కొందరు పారిశ్రామిక వేత్తల కోసమే పాటుపడ్డానా?’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారికి తదుపరి దశ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోడీ ఏకరువుపెట్టారు.