Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు కొత్త త‌లనొప్పి వ‌చ్చిప‌డింది

By:  Tupaki Desk   |   7 July 2016 10:19 AM GMT
ఉత్త‌మ్‌ కు కొత్త త‌లనొప్పి వ‌చ్చిప‌డింది
X
అస‌లే వరుస వైప‌ల్యాల‌తో కుదేల‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇపుడు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్‌ గా సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తి గ‌ళం వినిపిస్తున్నారు. త‌మ వారికి ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని కొంద‌రు అంటుంటే..త‌న‌తో చ‌ర్చించ‌కుండా ఇలా చేశారేంట‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు.

పీసీసీ రాష్ట్ర ర‌థ‌సార‌థిగా బాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర తర్వాత కొత్త కమిటీని నియమించుకున్నారు. తాజాగా ఆయన ప్ర‌క‌టించిన పీసీసీ అధికార ప్రతినిధుల జాబితా కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది. పెద్ద సంఖ్య‌లో అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించిన‌ప్ప‌టికీ జంబో టీమ్ లో చోటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార ప్రతినిధుల నియామకంపై మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ .. ఫైరయ్యారు. తనను సంప్రదించకుండా తన నియోజకర్గానికి చెందిన వ్యక్తికి అధికార ప్రతినిధి పదవి ఇవ్వటంపై అభ్యంతరం తెలిపారు. ఇక తాను చెప్పిన వాళ్ళకు అధికార ప్రతినిధి ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ .. పీసీసీ చీఫ్ తో వాగ్వాదానికి దిగారు. కొన్ని నియోజకవర్గాలకు అసలు ప్రాధాన్యతే లేదని మరికొందరు నాయకులు ఉత్తమ్ ను కలిసి అసంతృప్తిని తెలియజేశారు.

ఇదిలాఉండ‌గా... అధికార ప్రతినిదులుగా ప్రకటించిన వారిలోనూ కొందరు అసంతృప్తి ఉన్నారు. కొన్ని రోజుల కిందట పార్టీలోకి వచ్చిన వారికీ - ఎప్పటినుంచో పార్టీలోకి ఉన్న తమకూ ఒకే పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి - సీనియర్ నేత నిరంజన్ తో పాటు మిగతా నేతలు ఉత్త‌మ్‌ జాబితాపై గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు అధికార ప్రతినిధుల నియామకం మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు.