Begin typing your search above and press return to search.

ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. గెలిచేది ఆయనేనట?

By:  Tupaki Desk   |   17 Oct 2022 1:20 PM GMT
ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. గెలిచేది ఆయనేనట?
X
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూతుల్లో 9వేల మందికి పైగా సభ్యులు ఓటు వేశారు. భారత్ జూడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్ణాటక సంగనకల్లు క్యాంపు వద్ద ఓటు వేశారు.

137 ఏళ్ల చరిత్రగల పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను సీన్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి ఈనెల 19న కౌంటింగ్ చేపట్టి అదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు.సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో 87 మంది డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ బూత్ తోపాటు చండీగఢ్ లో 100శాతం ఓటింగ్ నమోదైంది.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోటీగా శశిథరూర్ ఈ ఎన్నికల్లో నిలబడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు ఖర్గే , శశిథరూర్ బరిలో నిలిచారు. వీరిద్దరు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పీసీసీ ప్రతినిధుల మెప్పు పొందే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది సీనియర్లు, నేతలు ఆయనే మద్దతునిచ్చినట్లు సమాచారం.

ఈ విషయంలో శశిథరూర్ ఆరోపణలు గుప్పించారు. తాము తటస్థంగా ఉన్నామని గాంధీ కుటుంబం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీనియర్ల మద్దతు ఎక్కువగా ఉన్న ఖర్గే గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే వివాదరహితుడు అనే పేరు ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో థరూర్ ముందున్నారు. కానీ అసమ్మతి రాజేయడమే ఆయనకు మైనస్ గా మారింది. అధిష్టానానికి నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీచేస్తుండడం ఓడిపోవడం ఖాయంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.