Begin typing your search above and press return to search.

రాజయ్యకు మరో షాక్

By:  Tupaki Desk   |   5 Nov 2015 6:21 AM GMT
రాజయ్యకు మరో షాక్
X
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీకి పార్టీ టిక్కెట్ సాధించుకుని నామినేషన్ వేసిన మాజీ ఎంపీ - కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య అనూహ్య పరిణామాలతో పోటీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్ని ప్రమాదంలో సజీవ దహనం కావడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా... వారిని రాజయ్య కుటుంబం హత్య చేసిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. కోడలిపై వేధింపుల నేపథ్యంలో ఇదంతా జరగడంతో రకరకాల అనుమానాలు ఉన్నాయి. రాజయ్యను అరెస్టు చేశారు కూడా. అయితే.. ఈ పరిణామాలతో చిక్కుల్లో పడిన రాజయ్యకు ఇప్పుడు ఇంకో షాక్ కూడా తగిలేలా ఉంది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ తర్జనభర్జన పడుతున్నప్పటికీ సస్పెండ్ చేయాలన్న నిర్ణయమే ఎక్కువమంది నేతల నోటి నుంచి వినిపిస్తోంది. ఆయన కోడలు, మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాజయ్య కుటుంబంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజయ్యపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కొందరు నేతలు డిమాండ్‌ చేస్తుండగా.. నేరం రుజువు కాకముందే రాజయ్యను సస్పెండ్‌ చేస్తే పార్టీయే నేరం అంగీకరించినట్లవుతుందని మరికొందరు నేతలు అంటున్నారు. కాగా నేడు నాగార్జునసాగర్‌ లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ సదస్సులో రాజయ్య సస్పెన్షన్‌ పై నిర్ణయం తీసుకోబోతున్నారు.