Begin typing your search above and press return to search.

రాములమ్మ.. డీకే అరుణలకు ధీటుగా వారిని తెస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 Dec 2020 11:15 AM GMT
రాములమ్మ.. డీకే అరుణలకు ధీటుగా వారిని తెస్తున్నారా?
X
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే చాలు..రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగు ఉండదని లెక్కలు వేసుకున్న కాంగ్రెస్ పార్టీకి.. దిమ్మ తిరిగిపోయేలా షాకులు తగలటం తర్వాత.. ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఉనికి కోసం పోరాడే దుస్థితికి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆపార్టీ పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారింది. ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. కాంగ్రెస్ పరిస్థితి అయ్యో అనుకునేలా మారింది.

ఇలాంటివేళ.. పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు భారీ కసరత్తు సాగుతోంది. టీ పీసీసీ చీఫ్ ఎన్నికతో పాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా నేతల్ని తెర మీదకు తీసుకురావాలన్న యోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. రెండు పేర్లను సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

అందులో ఒకరు మాజీ మంత్రి కొండా సురేఖ కాగా.. రెండోవారు ఎమ్మెల్యే సీతక్కగా చెబుతున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు బలమైన మహిళా నేతలు ఇద్దరూ బీజేపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆ లోటు తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. డీకే అరుణ.. విజయశాంతిలకు ధీటుగా కాంగ్రెస్ లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నది పార్టీ ముఖ్యులు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బీసీ నేతగా కొండా సురేఖ.. ఆదివాసీ నేతగా సీతక్కకు తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరికి మంచి వాక్ ధాటితో పాటు.. నాయకత్వ లక్షణాలు పుష్కలం. అందుకే.. వీరిద్దరికి పార్టీలో సముచిత స్థానం.. గౌరవమిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన డీకే అరుణ.. విజయశాంతిలకు ధీటుగా మహిళా నేతల్ని తెర మీదకు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే వీలుందన్న మాట వినిపిస్తోంది.