Begin typing your search above and press return to search.

జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత .. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:00 PM GMT
జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత .. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
X
జగిత్యాలలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. రైతులు చలో జగిత్యాల పేరుతో కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన మొక్కజొన్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్డు పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో మరోవైపు కలెక్టరేట్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బందం చేస్తున్నారు పోలీసులు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ చలో జగిత్యాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి నుంచే రైతు ఐక్యవేదిక నాయకులతో పాటు, కాంగ్రెస్ ముఖ్య నేతలను నిర్బంధించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు. ఆయన నివాసం ముందు భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారులకు లాభం చేకూర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. రైతులను సీఎం కేసీఆర్ నట్టేటా ముంచారని.. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.