Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి షాక్.. సీనియర్ల తిరుగుబాటు?

By:  Tupaki Desk   |   17 Dec 2022 10:33 AM GMT
రేవంత్ రెడ్డికి షాక్.. సీనియర్ల తిరుగుబాటు?
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తిరుగుబాటు ప్రారంభించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహా, ప్రేమ్ సాగర్ రావు సమావేశమయ్యారు. పార్టీలు మారి వచ్చిన నాయకులకు మమ్మల్ని ప్రశ్నించే స్థాయి లేదన్నారు. సీనియర్లపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒరిజనల్ కాంగ్రెస్ తమదేనని.. వలస వచ్చిన వాళ్లతోనే పోరాడుతామని స్పష్టం చేశారు.

దీంతో ఇక రేవంత్ రెడ్డి టార్గెట్ గానే తెలంగాణ సీనియర్లు ఏకమయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నీట్ ఇమేజ్ ఉన్న భట్టిని ముందు పెట్టి కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. భట్టి లాంటి నేత కూడా వాళ్లతో కలవడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రేగుతోంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ తీరు నచ్చక సీనియర్లు బీజేపీ బాట పడుతున్నారు.. ఒక్కో సీనియర్ నేత కమలం గూటికి చేరిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి నచ్చడం లేదంటూ వైదొలుగుతున్నారు.టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమయ్యారన్న భావన ఏర్పడుతోంది.

అధిష్టానం ఆదేశానుసారం పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరినీ ఇంటికి వెళ్లి కలిశారు. అందరి మద్దతు కోరారు. తనను వ్యతిరేకించిన వీహెచ్, కోమటిరెడ్డిలను కలిశారు. ఇంకా అంత బాగుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ నేతలంతా రేవంత్ వ్యవహారశైలి, నాయకత్వంపై విమర్శలు ప్రారంభించారు. జగ్గారెడ్డి మొదట్లో సానుకూలంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తి వ్యతిరేకమయ్యారు. తనను అసలు పట్టించుకోకపోవడంతోనే జగ్గారెడ్డి వ్యతిరేకమయ్యారు. ఇతర నేతలనూ పట్టించుకోవడం లేదు. స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సర్వేలు, నివేదికలు, రేవంత్ రెడ్డి చేర్పిస్తున్న చేరికలు అన్నీ సీనియర్లకు పొగబెట్టేలా ఉండడంతో వారంతా అసమ్మతి రాజేస్తూ బీజేపీ ఆఫర్ కు తలొగ్గి వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరిపోగా.. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. కొండా సురేఖ కూడా పదవి ఇవ్వలేదని రాజీనామా చేసింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కమిటీలో అనర్హులకు చోటు కల్పించి బలహీన వర్గాలకు కాంగ్రెస్ లో గుర్తింపు ఇవ్వలేదని దామోదర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో తెలయని వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కోవర్టులకే గుర్తింపు ఉంటోందని.. తెలంగాణకు కాంగ్రెస్ కు కోవర్ట్ ఇజం అనే ప్రమాదకరమైన జబ్బు సోకిందన్నారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ కు కోవర్టు రోగం పట్టుకుందన్నారు.

సీనియర్లు అంతా రేవంత్ వ్యవహారశైలి నచ్చక తిరుగుబాటు చేస్తుండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎలా ఏకతాటిపైకి వస్తుంది. పార్టీని ఎలా గాడినపెడుతారన్నది అధిష్టానానికి తల ప్రాణం తోకకు వస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.