Begin typing your search above and press return to search.

కంగనా రనౌత్ పై విరుచకుపడ్డ కాంగ్రెస్ మంత్రి, జావేద్ అక్తర్

By:  Tupaki Desk   |   19 Nov 2021 10:32 AM GMT
కంగనా రనౌత్ పై విరుచకుపడ్డ కాంగ్రెస్ మంత్రి, జావేద్ అక్తర్
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై విమర్శల వర్షం కురుస్తోంది. భారత స్వాతంత్ర్య సమరం, మహాత్ముడిపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. భారత్ కు స్వాతంత్ర్యం అనేది 2014లో వచ్చిందని.. 1947లో మనకు లభించింది భిక్ష మాత్రమేనని కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంగనాపై దేశ ద్రోహం కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.

ఈసారి ఏకంగా కంగనా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుంది. గాంధీ చెప్పినట్లు ఒక చెంప చూపితే స్వాతంత్ర్యం రాదని.. భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ కు గాంధీ మద్దతు లభించలేదని ఆమె వరుసగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి.

ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలకు నిరసనగా జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కంగనాపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత విజయ్ వాడ్డేటి వార్ కంగనాపై విరుచుకుపడ్డారు. ‘గాంధీపై కంగనా చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి.. ఒక ఐటెం గర్ల్ చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఆమె గురించి ఎక్కువగా చర్చ అవసరం లేదు’ అని మంత్రి విజయ్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఇక కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ కూడా ఘాటుగా స్పందించారు. నేరుగా ఆమె పేరు ప్రస్తావించకుండానే ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇది అందరికీ అర్థమయ్యేలానే ఉంది. స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు మన స్వాతంత్య్ర పోరాటాన్ని ‘భిక్ష’ అని పిలుస్తున్నారు. ఇది వారికి ఎందుకు బాధగా అనిపిస్తుంది’ అని ఘాటువ్యాఖ్యలు చేశారు.