Begin typing your search above and press return to search.

దొంగ ఓట్ల గొడవ.. బద్వేలులో చెప్పులతో కొట్టుకున్నారు

By:  Tupaki Desk   |   30 Oct 2021 12:17 PM IST
దొంగ ఓట్ల గొడవ.. బద్వేలులో చెప్పులతో కొట్టుకున్నారు
X
బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్ల కలకలం చెలరేగింది. నేతల మధ్య గొడవలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు వేయడానికి గ్రామంలోకి వచ్చారని కొందరిని గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హుజూరాబాద్, బద్వేలులో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కడప జిల్లా బద్వేలులో అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ప్రచారం సాగింది. కొంత మంది మహిళలు బద్వేలు ఉప ఎన్నికల్లో అట్టూరుమండలంలో ఫేక్ ఐడీలతో ఓట్లు వేయడానికి వచ్చినట్టు తెలిసింది. పోలీసుల తనిఖీల్లో ఐడీ కార్డులు లేవని గుర్తించి ఆ మహిళలను పోలింగ్ కేంద్రం నుంచి వెనక్కి పంపించారు.

ఇక ఎస్ వెంకటాపురంలో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు చేసి కొంత మంది మహిళలకు సరైన గుర్తింపు కార్డు లేవని గుర్తించారు. వారిని వెనక్కి పంపించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇక ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు బారులు తీరారు. మరోవైపు గోపవరం మండలం బేతాయపల్లి లోని 261 పోలింగ్ కేంద్రంలో గర్భవతి ఓటు వేసేందుకు వచ్చింది. క్యూలో నిలుచొని సొమ్మసిల్లి పడిపోయింది. ఎన్నికల సిబ్బందిప్రాథమిక చికిత్సనందించారు.