Begin typing your search above and press return to search.

మారోసారి సంపూర్ణ లాక్ డౌన్ .. సిద్ధమంటూ సీఎం కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:47 AM GMT
మారోసారి సంపూర్ణ లాక్ డౌన్ .. సిద్ధమంటూ సీఎం కీలక వ్యాఖ్యలు !
X
లాక్ డౌన్ అంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనా రాకముందు లాక్ డౌన్ అంటే ఏమిటో దాదాపుగా చాలామందికి తెలియదు. కానీ, కరోనా వచ్చిన తర్వాత ఆ దేశం , ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. దీనితో ప్రజలు నానా అవస్థలు పడ్డారు .. పడుతున్నారు కూడా. ఇక ఇదిలా ఉంటే మనదేశ రాజధాని అయిన ఢిల్లీ లో గత కొన్ని రోజులుగా మళ్లీ కాలుష్య సమస్య రోజురోజుకి పెరుగుతూవచ్చింది. దీనితో అవసరం అనుకుంటే ఢిల్లీ మొత్తాన్ని సంపూర్ణ లాక్ డౌన్ వేయడానికి కూడా సిద్దమే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది.

ఢిల్లీ కాలుష్యం పై ఈ రోజు సుప్రీం కోర్టు లో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై. చంద్ర చూడ్‌, జస్టిస్‌ సూర్య కాంత్‌ లతో కూడిన బెంచ్ లో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కేవలం 10శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. కేంద్రం వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రణాళికను న్యాయస్థానానికి అందజేసింది. దీనిలో స్టోన్‌ క్రషర్లను, కొన్ని రకాల విద్యత్తు కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపివేయడం వంటివి ఉన్నాయి.

వీటిని అమలు చేస్తే కొంత ఫలితం ఉంటుందని సోలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. మరోపక్క అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం న్యాయస్థానానికి ప్రమాణ పత్రం సమర్పించింది. దీనిలో దిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని, లాక్‌ డౌన్‌ మాత్రమే తక్షణం కొంత మేరకు ప్రభావం చూపించగలదని తెలిపింది. స్థానిక ఉద్గారాలను అదుపు చేసేందుకు సంపూర్ణ లాక్‌ డౌన్‌ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనితో పాటు పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌ సీఆర్‌ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలే తీసుకొంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. లాక్‌ డౌన్‌ కచ్చితంగా దిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది.

ఈ చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఎన్‌ సీఆర్‌ రీజియన్‌ లో అమలు చేయాలని కేంద్రం గానీ, కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌ మెంట్‌ గానీ ఆదేశించాలి అని ప్రమాణ పత్రంలో వెల్లడించింది. ఢిల్లీ లో రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌ దిల్లీ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ రాహుల్‌ మెహ్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇలాంటి కుంటి సాకులు చెబితే మీరు ఆర్జిస్తున్న ఆదాయం పాపులర్‌ స్లోగన్ల పై ఎంత వెచ్చిస్తున్నారో ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.