Begin typing your search above and press return to search.

పంతం కోసం రాష్ట్రం ఆగ‌మాగం అయినా ఫ‌ర్లేదా?

By:  Tupaki Desk   |   3 Jan 2019 2:30 PM GMT
పంతం కోసం రాష్ట్రం ఆగ‌మాగం అయినా ఫ‌ర్లేదా?
X
ప్ర‌జ‌ల మంచి కోరే ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఏం చేయాలి? రాష్ట్రం ప్ర‌శాంతంగా ఉండాలి. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు తీయాలి. ఆందోళ‌న‌లు.. ఉద్రిక్త‌త‌ల‌కు దూరంగా ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌నుల్లో వారు మునిగిపోవాల‌ని అనుకుంటారు. కానీ.. ఘ‌న‌త వ‌హించిన కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ కు మాత్రం ఒక కోర్టు తీర్పు అమ‌లు చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కోట్లాది మంది విభేదిస్తున్న తీర్పును.. వందల ఏళ్లుగా సాగుతున్న సెంటిమెంట్ లాంటివేమీ త‌న‌కు ప‌ట్ట‌వ‌ని.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి 50 ఏళ్ల లోపు మ‌హిళ‌ల చేత ద‌ర్శ‌నం చేయించ‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్న మొండిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించిన ముఖ్య‌మంత్రి తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక ప‌ని చేస్తే ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు పెల్లుబుక‌టంతో పాటు.. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న అంచ‌నా ఉన్న‌ప్పుడు.. ఆ ప‌ని చేయ‌క‌పోవ‌టం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి.. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి భంగం వాటిల్ల‌ద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఉన్న‌ప్పుడు.. ఆ అంశాల్ని ప‌ట్టించుకోకుండా కేవ‌లం తన పంతాన్ని నెగ్గించుకోవాల‌ని ఒక సీఎం భావించ‌టం దేనికి నిద‌ర్శ‌నం?

అవ‌స‌రం లేని వేళ అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌లు కొని తెచ్చుకున్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేర‌ళ ముఖ్య‌మంత్రి తీరును మేధావులు.. వామ‌ప‌క్షవాదులు ఎందుకు త‌ప్పు ప‌ట్ట‌టం లేదు? త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌.. త‌మ పార్టీ భావ‌జానికి సానుకూలంగా వ్య‌వ‌హ‌రించే ఇద్ద‌రు మ‌హిళ‌ల చేత‌.. పోలీసుల సంర‌క్ష‌ణ‌లో కోట్లాది మంది ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను దెబ్బ తీయ‌టానికి ఒక ముఖ్య‌మంత్రి చేసిన ప్ర‌య‌త్నం కేర‌ళీయుల్లో ఆగ్ర‌హం పెల్లుబుకేలా చేస్తుంటే.. మేధావులు మాత్రం మౌనంగా ఉన్నార‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.

మేధావులుగా మీడియాలో క‌నిపించే ప‌లువురు క‌మ్యునిస్ట్ భావ‌జాలంతో ఉండే వారు కావ‌టమే దీనికి కార‌ణ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు మీడియా సంస్థ‌ల్లో ఇప్ప‌టికి వామ‌ప‌క్ష భావ‌జాలం మొండుగా ఉండే వారు కీల‌క స్థానాల్లో ఉండ‌టం.. ప్ర‌గ‌తిశీల భావ‌జాలం పేరుతో సిద్దాంతాల్ని వ‌ల్లె వేసే వారికి జ‌న‌ఘోష కంటే కూడా తాము అనుకున్న‌దే జ‌రిగి తీరాల‌న్న ప‌ట్టుద‌ల ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కార‌ణంతోనే కోట్లాది మంది నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు క‌మ్యునిస్టుల్ని క‌దిలించ‌వు. తాము అనుకున్న‌ది చేయ‌టం.. అలా చేసే వారిని వెన‌కేసుకురావ‌టం.. వారికి అండ‌గా నిల‌వ‌ట‌మే కాదు.. వారి ప‌క్షాన నిలిచి వాద‌న‌లు వినిపించే క్ర‌మంలో కోట్లాది మందిని లెక్క చేయ‌ని త‌త్త్వం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. మీడియాలోని కీల‌క విభాగాల్లో వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్నోళ్లు ఉండ‌టంతో కేర‌ళ సీఎం మొండిత‌నం వారి క‌ళ్ల‌కు క‌నిపించ‌ని ప‌రిస్థితి.