Begin typing your search above and press return to search.

బాబూ.. ఏపీకో స‌చివాల‌యం ఉంది!

By:  Tupaki Desk   |   7 Jun 2017 4:59 PM GMT
బాబూ.. ఏపీకో స‌చివాల‌యం ఉంది!
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు తీరుపై తాజాగా వివిధ వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని, ప్ర‌చారాన్ని ప‌ట్టించుకుంటున్న సీఎం చంద్ర‌బాబు... ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌కుండా ప‌రిపాల‌నను గాలికి వ‌దిలేస్తున్నార‌ని ప‌లువురు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా నవనిర్మాణ దీక్షల గురించి. దీక్ష‌ల‌ పేరుతో మంత్రులంతా జిల్లాల్లోనే ఉండటం, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సచివాలయంలో పాలన పడకేసింది. మినీ మహానాడులు - మహానాడుకు వారంరోజులు.. నవనిర్మాణ దీక్షలకు మరో వారం రోజులు కేటాయించడంతో సచివాలయం వెలవెలబోతోందని అంటున్నారు.

ఏపీ విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న నవనిర్మాణ దీక్షల్లో తప్పనిసరిగా పాల్గొనాలని మంత్రులను సీఎం చంద్ర‌బాబు ఆదేశించడంతో అమాత్యులంతా జిల్లాలకే పరిమితమైపోయారు. దాంతో రెండు వారాలుగా మంత్రులు సచివాలయం వైపు రావడం లేదంటున్నారు. ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ సెక్రటేరియట్‌ గడప తొక్కడం లేదు. మంత్రుల రాకపోవడంతో... ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదనే ప్ర‌చారం సాగుతోంది. దాంతో రెండు వారాలుగా సచివాలయంలో పాలన కుంటుపడింది. ప్రతి సోమ, గురువారాల్లో మంత్రులు తప్పనిసరిగా సెక్రటేరియట్‌ లో అందుబాటులో ఉండాలన్న సీఎం ఆదేశాలను ఎక్కువమంది మంత్రులు పట్టించుకోవడం లేదని, దాంతో సచివాలయం వెలవెలబోతోందని వివిధ ప‌నుల‌పై వ‌చ్చిన వారు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు దీక్ష‌ల పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న నవనిర్మాణ దీక్షలకు ప్రజల నుంచి మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ లో చంద్రబాబు దీక్షా శిబిరం ప్రారంభించిన మొదటిరోజే జనం లేక వెలవెలబోయిన‌ట్లు మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అయితే జనం ఉన్నా.. లేకున్నా.. చంద్రబాబు మాత్రం తన స్టైల్లో స్పీచ్‌ లిచ్చుకుంటూ పోతున్నారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/