Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల గురివింద మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   8 July 2017 4:16 AM GMT
ఏపీ మంత్రుల గురివింద మాట‌లు విన్నారా?
X
గురివింద‌కు త‌న కింది న‌లుపు అస్స‌లు క‌నిపించ‌దు. ఎదుటోళ్ల‌ను విమ‌ర్శించే క్ర‌మంలో అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం ఒక అల‌వాటుగా ఉంటుంది. త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకోలేని స‌త్తా లేని కొంద‌రు రాజ‌కీయ‌నేత‌ల మాట‌లు వింటే కామెడీగా అనిపిస్తాయి. త‌మ లోపాల్ని.. ఎదుటోళ్ల మీద‌కు నెట్టేసి ప‌బ్బం గ‌డుపుకునే ఈ త‌ర‌హా రాజ‌కీయం పాత చింత‌కాయ పచ్చడి గా అనిపించ‌క మాన‌దు.

కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో కావాల‌ని ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి.. ఎదుటి వారి మీద బుర‌ద చ‌ల్ల‌టం రాజ‌కీయాల్లో అనాదిగా వ‌స్తున్న ఓ అల‌వాటు. ఈ రోజు (శ‌నివారం) గుంటూరు శివారులోని నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదుట విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీని ఏర్పాటు చేసుకుంది. దీన్ని దెబ్బ తీయ‌టానికి వీలుగా తెలుగు త‌మ్ముళ్లు కొంద‌రు గుడ్డు మీద ఈక‌లు పీకిన చందంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఇందులో విప‌క్ష నేత జ‌గ‌న్ ను.. ఆయ‌న పార్టీని టార్గెట్ చేసిన వైనం చూసిన వెంట‌నే గురివింద గుర్తుకు రాక మాన‌దు. త‌మ త‌ప్పుల్ని ఎంచుకోని స‌ద‌రు ఏపీ మంత్రులు ప‌లువురు విప‌క్ష నేత త‌ప్పుల్ని ఎంచే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇంత‌కీ గుడ్డు మీద ఈక‌లు పీకే ప్రొగ్రాంకు తెర తీసింది ఎవ‌రంటారా? ఇంకెవ‌రూ.. అడ్డ‌గోలుగా మాట్లాడ‌ట‌మే కానీ మాట్లాడే మాట‌ల్లో ఏమైనా లాజిక్ ఉందా? అన్న‌ది కూడా చూసుకోవ‌టం చేత‌కాని మంత్రి అచ్చెన్నాయుడు.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ మారి మంత్రి అయిన‌ ఆదినారాయ‌ణ రెడ్డి.. ఇంకో మంత్రి న‌క్కా ఆనంద్ బాబులు ఉన్నారు.

ఇంత‌కీ వీరి వ్యాఖ్య‌లు ఏమిట‌న్న‌ది చూస్తే..

ఏపీ మంత్రుల ఆరోప‌ణ‌: జ‌గ‌న్ పార్ట్ టైం పొలిటీషియ‌న్ గా.. ఫుల్ టైం అభివృద్ధి నిరోధ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

సామాన్యుడి మాట‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌ల్ని వెలికి తీసి..బాధితుల్ని వెళ్లి క‌లుసుకోవ‌టం.. వారి ఆవేద‌న‌ను పంచుకోవ‌టం.. వారికి ఓదార్పు క‌ల్పించ‌టం పార్ట్ టైమా? ఫుల్ టైమా?

ఏపీ మంత్రుల ఆరోప‌ణ‌: ఈ మూడేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దానిని అడ్డుకోవడానికి పథక రచన తప్ప ఈ రాష్ట్రానికి.. మీకు (జగన్‌కు) ఉన్న అనుబంధం ఏమిటి? ప్లీనరీలు - పలకరింపులు - ధర్నాలకు తప్ప ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జగన్‌ ఏనాడైనా ఇక్కడకు వచ్చారా?

సామాన్యుడి మాట‌: అధికార‌ప‌క్షం చేసే త‌ప్పుల్ని ఎత్తి చూప‌ట‌మే విప‌క్ష నేత విధి. ప్ర‌జ‌లు ఇచ్చిన బాధ్య‌త‌ను నెర‌వేరిస్తే అది.. అభివృద్ధిని అడ్డుకోవ‌ట‌మా? ఈ రోజు ఏపీలో అవినీతి గురించి అధికారప‌క్షంలోని నేత‌లే తీవ్రంగా తిట్టుకునే ప‌రిస్థితి. ఇక‌.. ఏపీ ప్ర‌జ‌ల ముచ్చ‌ట గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాల‌న‌లో అనుభ‌వం అన్న ఒక్క ఆలోచ‌న‌తో అధికారాన్ని అప్ప‌జెప్పిన పాపానికి మూడేళ్లుగా ఎంత ఆరాచ‌క పాల‌న సాగిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్లీన‌రీలు.. ప‌ల‌క‌రింపులు.. ధ‌ర్నాల‌తో సామాన్యుడు ఎంత దోపిడీకి గురి అవుతున్నాడ‌న్న విష‌యాన్ని వివ‌రించ‌టం జ‌గ‌న్ చేసిన త‌ప్పే అవుతుందా?

ఏపీ మంత్రుల ఆరోప‌ణ‌: ఇక్కడ ప్లీనరీ జరుపుకోవడానికి మీకున్న నైతిక హక్కేమిటి? అర్జెంటుగా రాత్రికి రాత్రి అధికారంలోకి రావాలన్న యావ తప్ప ప్రజల పట్ల... ఈ రాష్ట్రం పట్ల మీకున్న నిబద్ధత ఏమిటి? ముఖ్యమంత్రి... ఆయన కుటుంబ సభ్యులపై నిత్యం నిందలు వేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకంగా ఇచ్చిన సలహా చూపించగలరా?

సామాన్యుడి మాట‌: త‌ప్పు చేసిన వారిని త‌ప్పు చేశార‌ని చెప్ప‌టం త‌ప్పు ఎలా అవుతుంది? ప‌్లీన‌రీని జ‌రుపుకోవ‌టానికి మీకున్న నైతిక హ‌క్కేమిటి? అన్న ప్ర‌శ్న‌లోనే అధికార‌ప‌క్షం ప‌వ‌ర్ ను చూపించార‌ని చెప్పాలి. ప‌వ‌ర్‌లోకి రావాల‌న్న యావ త‌ప్పించి ప్ర‌జ‌ల ప‌ట్ల‌.. రాష్ట్రం ప‌ట్ల నిబ‌ద్ధ‌త ఏమిటి? అన్న ప్ర‌శ్న వేస్తున్న అధికార‌ప‌క్ష నేత‌లు.. ప‌వ‌ర్ లో ఉన్న తాము గ‌డిచిన మూడేళ్ల‌లో ఏం చేశామ‌న్నది లెక్క చూసుకుంటే అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఏపీ మంత్రుల ఆరోప‌ణ‌: ‘వైసీపీకి ఆంధ్ర రాష్ట్రంలో కార్యాలయం లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఉండరు. రాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్రానికి వస్తే ఆయన్ను తన ఎమ్మెల్యేలు - ఎంపీలతో పొరుగు రాష్ట్రంలో కలుస్తారు. పార్టీ ప్లీనరీ పెట్టడానికి మాత్రం ఈ రాష్ట్రం గుర్తుకొచ్చింది'

సామాన్యుడి సందేహం: ఏపీ విప‌క్ష నేత మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్న అధికార‌ప‌క్ష నేత‌లు.. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విలో ఉండి.. రాష్ట్రంలో ఇల్లు క‌ట్టుకోకుండా హైద‌రాబాద్ లో ఎందుకు క‌ట్టుకున్న‌ట్లు? నిజ‌మే.. ఏపీ రాజ‌ధానిలో జ‌గ‌న్‌కు ఇల్లు లేదు.. పార్టీ కార్యాల‌యం లేదు. కానీ.. ఆయ‌నేమీ కొత్త‌గా హైద‌రాబాద్ లో కోట్లాది రూపాయిల‌తో కొత్త ఇల్లు క‌నుక్కోలేదుగా? ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి కుటుంబ‌మే హైద‌రాబాద్ ను వ‌దిలి రాలేక‌.. వ్యాపారాల‌న్నీ అక్క‌డి నుంచే నిర్వ‌హిస్తున్న వైనాన్నిఅధికార‌ప‌క్ష నేత‌లు ఎందుకు మ‌ర్చిపోతారు?

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి వ‌స్తే పొరుగు రాష్ట్రంలో క‌లుస్తారు. పార్టీ ప్లీన‌రీ పెట్ట‌టానికి మాత్రం ఈ రాష్ట్రం గుర్తుకొచ్చిందన్న మాట విన్నంత‌నే గురివింద గుర్తుకు రాక మాన‌దు. హైద‌రాబాద్ అన్న‌ది ఏపీకి ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న విష‌యాన్ని విభ‌జ‌న చ‌ట్ట‌మే చెప్పింది. అలాంట‌ప్పుడు రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్న‌ట్లు ఎందుకు అవుతుంది? ఆ చిన్న పాయింట్ ఏపీ మంత్రులు ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు?

ఏపీ మంత్రుల ఆరోప‌ణ‌: గత ఎన్నికల సమయంలో తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకుని తిరిగిన జగన్‌.. ఇప్పుడు అది లాభం లేదనుకుని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఫొటో పట్టుకుని తిరుగుతున్నారు

సామాన్యుడి సందేహం: మ‌ంత్రుల నోటి నుంచి వ‌చ్చిన మాటే నిజ‌మ‌నుకుంటే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో ఏపీ ముఖ్య‌మంత్రికి స‌న్నిహిత మిత్ర‌ప‌క్షం బీజేపీకి ఇదే ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు. అంటే.. బీజేపీ మిగిలిన వారిని.. అగ్ర నాయ‌కుల్ని వ‌దిలేసి ప్ర‌శాంత్ కిశోర్ మాట‌ల్నే విన్న‌ట్లా? ఇన్ని మాట‌లుమాట్లాడుతున్న ఏపీ మంత్రులు.. ఈ మ‌ధ్య‌నే విశాఖ‌లో తాము నిర్వ‌హించిన పార్టీ మ‌హానాడు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన క‌టౌట్లు.. ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్ల‌లో ఉద్దేశ పూర్వ‌కంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. తెలుగోళ్ల గుండెల్లో నిరంత‌రం ఉండే ఎన్టీవోడి ఫోటోల్ని ఎంత‌గా వాడారో ఏపీ ప్ర‌జ‌ల‌కు.. మ‌రి ముఖ్యంగా విశాఖ వాసుల‌కు బాగా తెలుసు? స్వ‌యంగా వెన్నుపోటు పొడిచి.. పార్టీ నుంచి గెంటేసిన మ‌హ‌నీయుడి పేరును.. ఫోటోనూ నేటికి వాడుకుంటూ.. మ‌హానాడు సంద‌ర్భంగా మాత్రం ప‌క్క‌న ప‌డేసే త‌మ్ముళ్ల నోటి నుంచి ఇలాంటి మాట‌లా?