Begin typing your search above and press return to search.

మోడీ ‘రద్దు’పై ప్రజల రియాక్షన్ ఏమిటి?

By:  Tupaki Desk   |   14 Nov 2016 3:54 AM GMT
మోడీ ‘రద్దు’పై ప్రజల రియాక్షన్ ఏమిటి?
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చఅంతా ఇంతా కాదు. ఏ ఇద్దరు కలిసినా తమకు ఎదురవుతున్న నోట్ల కష్టాలు.. వాటి పరిణామాలపైనే చర్చ సాగుతోంది. మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రజల మాటేమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మోడీ నోటి నుంచి రద్దుపై నిర్ణయం వెలువడిన వెంటనే.. ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. దీంతో.. రాజకీయనేతలు ఎవరూ నోరు విప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ లాంటి కొందరు నోరు పారేసుకున్నా.. వారికి వచ్చిన మైలేజీ ఏమీ లేదనే చెప్పాలి.

అందుకే.. అలాంటి వారితో కలిసి నడిచేందుకు పలువురు రాజకీయ అధినేతలు మక్కువ చూపలేదు. బుధవారం రాత్రి వెలువడిన రద్దు నిర్ణయం అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో శని.. ఆదివారాల్లో మోడీ తీరును వ్యతిరేకించే రాజకీయ పక్షాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పశ్చిమబెంగాల్ లో ఉప్పునిప్పుగా ఉండే విపక్షమైన సీపీఎంతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు సైతం తాము సిద్ధమంటూ బెంగాల్ అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో ఎప్పటికి కలవరన్న భావనకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి మమతనే సీపీఎంతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించటం గమనార్హం.

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం అమలు కానీ మొదలైతే.. రాజకీయంగా తమ ఉనికికే ప్రమాదం అన్న భావనకు రాజకీయ పార్టీలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందన్న ఆలోచనతో కామ్ గా ఉన్న రాజకీయ పార్టీలు.. బ్యాంకులు.. ఏటీఎంలకు వెళ్లిన వారికి సంతృప్తికరమైన పరిస్థితులు ఎదురుకాకపోవటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న రాజకీయ పార్టీలు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అందుకే గురువారం.. శుక్రవారం వరకూ వేచిచూసే ధోరణిని ప్రదర్శించిన పార్టీలు.. శనివారం నుంచి తమ గళాన్ని పెంచటాన్ని మర్చిపోకూడదు.

ఇక..నోట్ల రద్దుపై పలు ఛానళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాలు.. ఈ సందర్భంగా పలువురు ప్రజలతో ఫోన్లో మాట్లాడిన వేళ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై సామాన్యులు పాజిటివ్ గా రియాక్ట్ కావటం గమనార్హం. ఓపక్క వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతుంటే.. ప్రజలు మాత్రం ఈ నిర్ణయం మంచిదే అని చెబుతూ.. బ్యాంకు కష్టాలు లేకుండా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

వీరే కాదు.. వివిధ ప్రాంతాల్లో బ్యాంకు క్యూ లైన్లలో నిలుచున్న వారిలో చాలామంది.. గంటల కొద్దీ తమ సమయం పోవటంపై అసంతృప్తి.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పించి.. మోడీ నిర్ణయాన్ని మొత్తంగా తప్పుగా వ్యాఖ్యానించకపోవటం గమనార్హం. ఈ అంశాలన్నింటిని చూస్తే.. పెద్దనోట్ల రద్దుపై దేశ ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. బ్యాంకులు.. ఏటీఎం సెంటర్లలో నగదు లభ్యతపై కేంద్రం కాని ఫోకస్ చేస్తే.. మోడీకి ఈ అంశంపై మద్దతు ఇచ్చేవారు పెరుగుతారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఇప్పటివరకూ అండగా నిలిచిన వారు కాస్తా వ్యతిరేకులుగా మారిపోతారనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/