Begin typing your search above and press return to search.

జనసేనకు సీన్ లేదంటున్న స్టార్ కమెడియన్

By:  Tupaki Desk   |   21 Nov 2018 8:48 AM GMT
జనసేనకు సీన్ లేదంటున్న స్టార్ కమెడియన్
X
పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పెద్దగా ఉండదని అంటున్నాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మద్దతుదారు పృథ్వీ. తాను ఆంధ్రప్రదేశ్‌ లో అనేక ప్రాంతాలు తిరిగి.. జనాల్ని పరిశీలించానని.. ఆ అనుభవంతో చెబుతున్నానని.. జనసేన హవా ఏపీలో లేదని పృథ్వీ స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో తాను చెప్పలేకపోవచ్చని.. కానీ జనసేన ప్రభావాన్ని మాత్రం లెక్కగట్టగలనని అతనన్నాడు. పవన్ వాదనలు పవన్ కు ఉన్నాయని.. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని తాను అనుకోవడం లేదని చెప్పాడు. తాను కూడా కూడా స్టేజ్ ఎక్కి వంద మాట్లాడతానని... పవన్ కూడా అంతే అని.. అవన్నీ వినే ఓపిక.. పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేదని చెప్పాడు.

జనసేన వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఎలాంటి నష్టం ఉండదని పృథ్వీ చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని.. ఆ ఓట్లలో ఒక్కటి కూడా జనసేనకు పడదని.. ప్రభుత్వాన్ని వ్యతిరేస్తున్న ప్రజలు వైసీపీనే ఆరాధిస్తున్నారని.. జగన్ వెంట నడుస్తున్నారని చెప్పాడు. సినిమా స్టార్ కావడం వల్ల కేవలం పవన్ ను చూడ్డానికే ఆయన సభలకు వస్తున్నారన్నాడు. కాపు ఓటు బ్యాంకు మొత్తం జనసేన వైపు మళ్లుతుందని చెప్పడం మూర్ఖత్వమని పృథ్వీ అభిప్రాయపడ్డాడు. తాను స్వయంగా కాపు వర్గానికి చెందిన వాడినని.. కుల రాజకీయాల మీద ఎన్నికల్లో గెలుస్తామని భావిస్తే మూర్ఖత్వమని.. కులం పేరు మీద రాజకీయం చేసి ఓట్లు సాధించే సంస్కృతే మన దగ్గర లేదని పృథ్వీ అన్నాడు. కాపులు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం.. తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే వస్తాయని పృథ్వీ స్పష్టం చేశాడు.