Begin typing your search above and press return to search.

పుట్టెడు శోకంలో కల్నల్ సంతోష్ సతీమణి సంతోషి కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:30 AM GMT
పుట్టెడు శోకంలో కల్నల్ సంతోష్ సతీమణి సంతోషి కీలక వ్యాఖ్యలు
X
పగోడికి కూడా రాకూడని కష్టం ఆమెకు వచ్చింది. తనకు వచ్చిన కష్టానికి వేదన చెందుతున్నా.. తనలాంటి మరికొందరి శోకానికి కారణమైన చైనా సంగతి చూడాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కల్నల్ సంతోష్ సతీమణి సంతోషి. సైనికుల త్యాగాలు నిరుపయోగం కావొద్దని.. దేశం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. తన భర్తతో పాటు మరణించిన 20 మంది త్యాగాలు వేస్ట్ కావొద్దన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని తన భర్త చెప్పేవారని.. ఆయనిచ్చిన స్ఫూర్తితో తాము బతుకుతామని చెప్పారు. సంతోషి తాజా వ్యాఖ్యలు విన్న వారి రోమాలు నిక్కబొడుస్తున్నాయి. చైనా దురాగతాలకు దేశం చెక్ పెట్టాలన్న ఆగ్రహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. దివంగత కల్నల్ సంతోష్ కుమార్తె మాటలు విన్నంతనే కన్నీళ్లు సుడులు తిరగక మానవు.

తన తండ్రి తిరిగి రారన్న సత్యాన్ని ఆమె గుర్తిస్తూనే.. తన తమ్ముడికి ఇంకా ఆ విషయం తెలీదని ఏడుస్తూ చెబుతోంది. తమ్ముడు అడిగితే.. నాన్న ఆఫీసుకు వెళ్లారని చెబుతున్నట్లు చెప్పింది. తండ్రి తమకుఎప్పుడు ఫోన్ చేసినా జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారన్నారు. ఇంటికి వచ్చినప్పుడు చపాతీలు తినాలని చెప్పేవారని గుర్తు చేసుకుంది. తన తండ్రికి ఇలా కావటంతో తాను ఎంతో ఎడ్చినట్లుగా చెప్పిన ఆ చిన్నారి వేదనను తీర్చటం ఎవరికి సాధ్యం కాదని చెప్పక తప్పదు.