Begin typing your search above and press return to search.

వైసీపీలో హాట్ టాపిక్ గా తాడిపత్రి కోల్డ్ వార్.. ఏమవుతోంది?

By:  Tupaki Desk   |   23 July 2021 5:33 AM GMT
వైసీపీలో హాట్ టాపిక్ గా తాడిపత్రి కోల్డ్ వార్.. ఏమవుతోంది?
X
రాజకీయాల్లో విభేదాలు.. ఇంటిపోరు మామూలే. ఏపీలో ఎదురులేని రీతిలో సాగుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా అధిపత్య పోరు సాగుతున్నప్పటికీ.. పార్టీని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవి చాలా తక్కువనే అని చెప్పాలి. అందులో.. అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు అంతకంతకూ ముదిరిపోతోంది.

ఒకరిపై ఒకరికి ఉన్న రాజకీయ విభేదాల స్థాయి మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి రాజకీయంగా షాకివ్వాలన్నట్లుగా మారిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ రెడ్డి పట్టుదల ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయ వేడిని అంతకంతకూ పెంచుతోంది.

ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా తాడిపత్రిని చెబుతారు. ఆ నియోజకవర్గం పేరు చెప్పినంతనే గుర్తుకు వచ్చేది జేసీ బ్రదర్స్ పేరే. నియోజకవర్గంలో తిరుగు లేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ రాజకీయ అధిక్యతను నిలువరించి.. తన సత్తాను చాటటంలో సక్సెస్ అయ్యారు వైసీపీ నేత కమ్ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

సోషల్ మీడియాను వాడేసుకొని తన ఇమేజ్ ను భారీగా పెంచేసుకోవటంలో కేతిరెడ్డిని ప్రత్యేకించి చెప్పాల్సినందే. జేసీ బ్రదర్స్ కు చెక్ పెట్టేయటంలో కొంత మేర సక్సెస్ అయిన ఆయన.. సొంత పార్టీకి చెందిన స్థానిక నేత రమేష్ రెడ్డితో మాత్రం విభేదాల్ని పరిష్కరించటంలో ఆయన తప్పుల మీద తప్పులు చేస్తారని చెబుతారు.

ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఉన్నప్పటికీ.. ఆ సమయంలో రమేశ్ రెడ్డికి ఇచ్చిన హామీతో ఆయన శాంతించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీలో రమేష్ రెడ్డిని కూర్చోబెడతారన్న ఒప్పందం జరిగింది. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న రాజకీయంతో జేసీ బ్రదర్స్ చేతికి ఛైర్మన్ పగ్గాలు చేరాయి. దీంతో.. రమేశ్ రెడ్డి మరింతగా ఉడికిపోతున్నారు. తన పరిస్థితికి కారణం కేతిరెడ్డినే అని ఆయన మండిపడుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. ఒప్పందంలో భాగంగా తనకు చెందాల్సిన ఛైర్మన్ గిరికి కేతిరెడ్డి అనూహ్యంగా అడ్డుపడటం.. తన కొడుక్కి ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించేందుకు చేసిన ప్రయత్నాలతో ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమనే పరిస్థితి నెలకొందని చెబుతారు.

తనను మున్సిపల్ ఛైర్మన్ ను చేస్తుందని రమేష్ రెడ్డి ఆశపడితే.. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా తన మనుషుల చేత మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయించారని చెబుతారు. ఈ విషయాన్ని గుర్తించిన కేతిరెడ్డి.. అధిష్ఠానానికి సమాచారం ఇవ్వటం.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో తన వర్గీయుల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని చెప్పటంతో రమేశ్ రెడ్డి మరింత రగిలిపోతున్నట్లు గా వినిపిస్తూ ఉంటుంది.

ఇలా ఇరువురి మధ్య నడిచిన అధిపత్య పోరు.. తనకు దక్కనిది తన రాజకీయ ప్రత్యర్థికి అసలే దక్కకూడదన్న పట్టుదలతో రమేశ్ రెడ్డి వ్యవహరించటం.. మధ్యలో జేసీ బ్రదర్స్ రాజకీయ చాణక్యంతో వైసీపీ చేతి నుంచి తాడిపత్రి మున్సిపాలిటీ చేజారినట్లుగా చెబుతారు. అయితే..ఈ ఎపిసోడ్ లో కేతిరెడ్డికి అధిష్ఠానం నుంచి గట్టిగా తలంటు పోసినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతుంటాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ రావాల్సి ఉన్నా.. అలా జరగకుండా అడ్డుకున్న కేతిరెడ్డి.. తర్వాత కూడా మున్సిపల్ ఛైర్మన్ పదవికి దక్కుండా చేసిన కేతిరెడ్డికి తగిన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందన్న పట్టుదలతో రమేశ్ రెడ్డి ఉన్నట్లు చెబుతారు.

ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు ప్రత్యర్థులకు అవకాశంగా మారుతుందన్న ఆందోళన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తాడిపత్రిలో అధికార పార్టీకి సంబంధించిన అంతర్గత రచ్చను సెట్ చేయాల్సిన బాధ్యతను పార్టీ అధినాయకత్వం ఎంత త్వరగా తీసుకుంటే పార్టీకి అంత మేలు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది.