Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టుల‌కు సీఎం విందు..ఫుడ్ లో బొద్దింక‌!

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:45 AM GMT
జ‌ర్న‌లిస్టుల‌కు సీఎం విందు..ఫుడ్ లో బొద్దింక‌!
X
అదేందో కానీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం చేసినా చిరిగి చాటై.. చాతాండంత అవుతుంద‌న్న‌ట్లుగా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం కూడా ఇలాంటిదే. ఏపీ ముఖ్య‌మంత్రి ఈ రోజు విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందంతా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అల‌క‌ను తీర్చ‌టానికి ఆయ‌న ప‌డిన ఆదుర్దా అంతా ఇంతా కాదు.

ఈ మ‌ధ్య‌న విడుద‌లైన ఒక స‌ర్వేలో గంటా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న గెలుపు క‌ష్ట‌మ‌ని.. ఆయ‌న తీవ్ర ప్ర‌తికూల‌త ఎదుర్కొన్న‌ట్లుగా తేల్చారు. ఎవ‌రో స‌ర్వే చేస్తే గంటా అంత‌గా ఎందుకు ఫీల్ అవుతున్నార‌న్న అనుమానం రావొచ్చు. మ‌రి.. స‌ర్వే రిపోర్టు.. త‌మ ప్ర‌భుత్వానికి ద‌న్నుగా ఉన్న ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక చేయించింది కావ‌టంతో.. త‌న ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింద‌న్న బాధ‌లో ఉన్నారు గంటా.

విష‌యం అక్క‌డితో ఆగ‌లేదు.. త‌నను రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు వీలుగా స‌ర్వేను వాడుకున్నార‌ని.. ఇదంతా త‌న‌కు ఎర్త్ పెట్టేందుకు.. త‌న మీద నెగిటివ్ ప్ర‌చారం చేసేందుకు వీలుగా కుట్ర చోటు చేసుకుంద‌న్న అనుమానంతోనే గంటా అంత‌లా అల‌క చెందారంటున్నారు. గంటా లాంటి నేత అల‌క ఏపీ సీఎంకు ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. విశాఖ‌లో తాను ప‌ర్య‌టిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న ముఖం చాటేస్తే క‌లిగే రాజ‌కీయ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు హుటాహుటిన రాయ‌బారాలు చేయించి.. ఆయ‌న అల‌క వీడేలా చేశారు. హ‌మ్మ‌య్య‌.. అంతా ఓకే అయ్యింది.. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో చెల‌రేగిపోవ‌ట‌మే అనుకున్న బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల‌కు విందును ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు తింటున్న భోజ‌నంలో బొద్దింక రావ‌టంతో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. భీమిలిలో ఏర్పాటు చేసిన బాల సుర‌క్ష వాహ‌నాల ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందులో.. బొద్దింక రావ‌టంపై జ‌ర్న‌లిస్టులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ‌కు వ‌డ్డించే భోజ‌నం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోరా? అంటూ ఫైర్ అయ్యారు. ఈ వైనంపై జ‌ర్న‌లిస్టులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.