Begin typing your search above and press return to search.

పాట్నాకు పోటెత్తనున్న ముఖ్యమంత్రులు

By:  Tupaki Desk   |   12 Nov 2015 9:01 AM GMT
పాట్నాకు పోటెత్తనున్న ముఖ్యమంత్రులు
X
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన బీహార్ ఎన్నికల్లో లౌకిక మహా కూటమి అద్భుత విజయాన్ని సాధించటం తెలిసిందే. మోడీకి భారీ షాక్ ఇచ్చిన ఈ ఎన్నికల ఫలితాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకోవాలని లౌకిక మహాకూటమి భావిస్తోన్నట్లు తెలుస్తోంది. మోడీ పరపతిని తీవ్రంగా దెబ్బ తీసిన ఈ ఓటమితో.. మోడీ వ్యతిరేక వర్గం మొత్తం ఒక్కటయ్యేందుకు వీలుగా.. నితీశ్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే తన ప్రమాణస్వీకారోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లే నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నెల 20న మూడో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం (ఎన్నికల్లో గెలిచి) చేస్తున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి భారీగా వివిధ రాష్ట్రాల నేతల్ని ఆహ్వానించటం గమనార్హం.

ఇప్పటికే నితీశ్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తో పాటు.. పలువురికి నితీశ్ ఆహ్వానం పంపారు. దీనికి సోనియా.. రాహుల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక.. నితీశ్ ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్.. హాజరు కానున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాట్నాకు క్యూ కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

మరోవైపు.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించనున్నట్లుగా నితీశ్ ప్రకటించిన నేపథ్యంలో.. మోడీకి ఈ వ్యవహారం మరింత ఇబ్బందిగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా నితీశ్ ప్రమాణమహోత్సవానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యూ కట్టేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.