Begin typing your search above and press return to search.

హమ్మయ్యా..ఆరోగ్యశ్రీకి ఆవిష్కర్త పేరు తోడైంది

By:  Tupaki Desk   |   3 Jun 2019 2:08 PM GMT
హమ్మయ్యా..ఆరోగ్యశ్రీకి ఆవిష్కర్త పేరు తోడైంది
X
ఆరోగ్యశ్రీ... ఈ పేరు వినగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. అప్పటిదాకా కార్పొరేట్ ఆసుపత్రి అనే పేరు వినడం, అల్లంత దూరాన్నుంచి దానిని చూడటం మినహా... అందులో చికిత్స అన్న మాటే ఎరుగని పేద, మధ్య తరగతి జనానికి అధునాతన వైద్య సేవలను ఉచితంగా అందించడమే లక్ష్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ‘ పేరిట సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు లభించడమే కాకుండా చికిత్స అనంతరం మందులను కూడా ఉచితంగానే అందేవి. ఈ పథకం వచ్చిన తర్వాత అప్పటిదాకా రాజశేఖరరెడ్డికి ఉన్న ఇమేజీ మరింతగా ఇనుమడించిందనే చెప్పాలి. వైఎస్ ను జనం తమ గుండెల్లో పెట్టుకోవడానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేసిందని చెప్పాలి.

అయితే రాజశేఖరరెడ్డి అకాల మరణం, ఆ తర్వాత నాలుగున్నరేళ్లకు తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు... ఆ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చేయడం, జాబితాలోని చికిత్సలను తగ్గిస్తూ - పెంచుతూ... మొత్తంగా ఆ పథకాన్నే భ్రష్టు పట్టించారని చెప్పక తప్పదు. అయితే ఎవరు ఎన్ని చేసినా - ఏ పేరు మార్చినా... ఇప్పటికీ జనం ఆ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీగానే పిలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఏమిటో తెలియదు గానీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ మాత్రం ఇప్పటికీ అందరికీ తెలుసు. అంతగా జనంలోకి వెళ్లిన ఈ పథకానికి ఇప్పుడు మరోమారు పేరు మారింది. ఈ పథకాన్ని ఎవరైతే అంకురార్పణ చేశారో, వారి పేరునే ఈ పథకానికి జోడించి ఏపీకి నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్ వైద్యసేవగా కొనసాగుతున్న ఈ పథకాన్ని ఇకపై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీగా మార్చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని మరింతగా విస్తరించే దిశగా జగన్ తనదైన శైలిలో సమీక్ష చేస్తున్నారు. ఇకపై ఎంత పెద్ద రోగం వచ్చినా... డబ్బులు లేవన్న కారణంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బందిపడరాదన్న భావనతో ఉన్న జగన్... ఆ మేరకే ఈ పథకాన్ని మరింతగా విస్తరించే దిశగా యోచిస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎవరైతే ప్రారంభించారో, వారి పేరునే ఆ పథకానికి చేర్చేసి... దానిని మరింతగా విస్తరిస్తే... ఇకపై రాష్ట్రంలో వైద్యం అందని కారణంగా జరిగే మరణాలు దాదాపుగా కనిపించవన్న మాట వినిపిస్తోంది.