Begin typing your search above and press return to search.

మోడీ చెప్ప‌డం వ‌ల్లే..కేసీఆర్‌ కు ఆ ఫోన్ వ‌చ్చిందా?

By:  Tupaki Desk   |   7 Aug 2018 5:54 PM GMT
మోడీ చెప్ప‌డం వ‌ల్లే..కేసీఆర్‌ కు ఆ ఫోన్ వ‌చ్చిందా?
X
బీజేపీతో తెలంగాణ సీఎం కేసీఆర్ దోస్తీ మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి నేప‌థ్యంలో బీజేపీకి మ‌రోమారు కేసీఆర్ ద‌గ్గ‌ర కానున్నార‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. డిప్యూటీ చైర్మ‌న్ పోస్ట్‌ ను దక్కించుకోవడానికి అధికార - ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీ - కాంగ్రెస్ వర్గాలు తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఏ అభ్యర్థి గెలవాలన్నా.. బీజేడీ - టీఆర్ ఎస్ పార్టీ కీలకంగా మారటంతో.. మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం కేసీఆర్‌ కు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నితీష్‌ కు కేసీఆర్ చెప్పారు. అయితే ఇది లాంచ‌న ప్రాయ‌మేన‌ని...కేసీఆర్ ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కు ఈనెల 9న ఎన్నిక జరగనుంది. ఆగస్టు 8 మధ్యాహ్నం లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఏకాభిప్రాయంతో డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకోవాలని.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. అయినా అధికార - ప్రతిపక్షాలు.. డిప్యూటీ చైర్మన్ పదవిని చాలెంజ్ గా తీసుకున్నాయి. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార బీజేపీ ఇప్ప‌టికే ఈ స్థానాన్ని కైవ‌సం చేసుకునే ఎత్తుగ‌డలు వేస్తోంది. ఈ మేర‌కు పార్లమెంట్ లైబ్రరీ హాల్‌ లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. డిప్యూటీ చైర్మ‌న్ స్థానం గెలించేందుకు సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున... ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ సింగ్ నారాయణ్ ను బరిలో నిలబెట్టారు. మ‌రోవైపు పార్లమెంట్‌ లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - లోక్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే - రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ - పార్టీ ఎంపీలు హాజరయ్యారు. యూపీఏ అభ్యర్థిగా త్రుణమూల్ నేత పేరు వినిపించినా చివరికి ఎన్సీపీ ఎంపీ వందన చవాన్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఇక రెండు కూటముల్లో ఎవరు గెలవాలన్నా బీజేడీ - టీఆర్ ఎస్ కీలకంగా మారాయి. దీంతో రెండు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పార్టీలు ఉన్నాయి. హరివంశ్ గెలుపు కోసం రంగంలోకి దిగారు బీహార్ సీఎం నితీష్ కుమార్. సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. జేడీయూ ఎంపీ హరివంశ్ కు మద్దతివ్వటంలో ఇబ్బంది ఏమీలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాగా, టీఆర్ ఎస్ పార్టీ ఆది నుంచి కేంద్రంతో సామరస్యంగా ఉంటూ వస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క నిర్ణ‌యాలైన‌ జీఎస్టీ - పెద్దనోట్ల రద్దు వంటి కీలకాంశాల్లో టీఆర్ ఎస్ పార్టీ సహకారం అందించింది. అంతేకాకుండా ఇటీవ‌ల లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్నా ఓటింగ్‌ కు దూరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌ద్ద‌తు నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.