Begin typing your search above and press return to search.

కేసీఆర్ పెట్టిన ఫిటింగ్‌తో క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం

By:  Tupaki Desk   |   3 Feb 2022 2:38 AM GMT
కేసీఆర్ పెట్టిన ఫిటింగ్‌తో క‌మ్యూనిస్టుల క‌ల‌వ‌రం
X
గ‌త కొద్దికాలంగా వేగంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న క‌మ్యూనిస్టు పార్టీల‌ ప్ర‌భావం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేన‌ప్ప‌టికీ, ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌తో మ‌ళ్లీ ఆ పార్టీల గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. క‌మ్యూనిస్టు పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌ల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌గ‌తిభ‌వ‌న్లో చ‌ర్చ‌లు జ‌రిపి పోరాట‌పంథాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌మ్యూనిస్టులు కేసీఆర్ విష‌యంలో త‌ట‌స్థ వైఖ‌రి స్థాయికి చేరుకున్నాయి. అలా చేరుకున్న ఫ‌లితంగానే తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్ల విష‌యంలో క‌క్క‌లేక మింగ‌లేక అన్న ప‌రిస్థితికి చేరుకున్నాయి.

దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలు త‌మైద‌న శైలిలో స్పందిస్తుండ‌గా సీపీఐ మాత్రం ఆచితూచి స్పందించింది. అనేక చర్చోపచర్చల అనంతరం రూపొందించిన రాజ్యాంగం స్థానంలో నూతన రాజ్యాంగాన్ని తీసుకు రావాల్సిన అవసరం లేదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

రాజ్యాంగం బలోపేతం చేసేందుకు అవసరమైతే దానిని సవరించేందుకు రాజ్యాంగ నిర్మాతలు అవకాశం కల్పించారని చాడ వెంక‌ట‌రెడ్డి తెలిపారు. అంబేద్కర్ నేతృత్వంలో మేధావులు భారతదేశ వైవిధ్యం, బహుళత్వాన్ని పరిగణలోకి తీసుకొని సుదూరదృష్టి తో రాజ్యాంగాన్ని రచించారని ఆయ‌న తెలిపారు. ఈ రాజ్యాంగంలో మౌలిక అంశాలను మార్చేందుకు బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు ఎప్పటి నుండో పొంచి ఉన్నాయని పేర్కొంటూ రాజ్యాంగ పీఠిక నుండి లౌకికవాదం, సోషలిజం పదాలను తొలగించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొత్త రాజ్యాంగం అనే చర్చ తేనె తుట్టే కదిపి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగే ప్రమాదం ఉంద‌ని అన్నారు.

ప్ర‌స్తుత‌మున్న రాజ్యాంగం సమతుల్యం గానూ, దేశ సమగ్రత, సమైక్యతను బలోపేతం చేసేదిగా ఉంద‌ని చాడ వెంక‌ట‌ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన పిదప అనేక ఉల్లంఘనలకు పాలుపడుతుంద‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పోకడలున్నాయ‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వ రంగం, లౌకిక వ్యవస్థ, మొదలగు వ్యవస్థలు బీజేపీ ప్రభుత్వంలో ధ్వంసం అయినందున సీరియస్‌గా ఆయా అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల‌ని సూచించారు. కాగా, కేసీఆర్ కామెంట్లు కేంద్రంలోని త‌మ ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన బీజేపీ స‌ర్కారు ఆలోచ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌న్న మాట‌ను అన‌కుండా సీపీఐ కార్య‌ద‌ర్శి వ్య‌వ‌హ‌రించ‌డం కేసీఆర్ ఎత్తుగ‌డ‌లో వామ‌ప‌క్షాలు చిక్కుకున్నాయ‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.