Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఆయ‌న్ను కేసీఆర్ క‌లిసింది ఇందుకేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2018 4:47 PM GMT
ఢిల్లీలో ఆయ‌న్ను కేసీఆర్ క‌లిసింది ఇందుకేనా?
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిర్వచన్ సదన్‌ లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన అనంత‌రం ఈ స‌మావేశం జ‌రిగింది. తాజాగా జరిగిన ఎన్నికలు - పలు అంశాలపై సునీల్ అరోరాతో సీఎం కేసీఆర్ చర్చించారని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే కొన్ని గుర్తులపై అభ్యంతరం తెలుపుతూ సీఈసీకి సీఎం కేసీఆర్ ఓ వినతిపత్రం ఇచ్చారు. టీఆర్ ఎస్ పార్టీకి ఈసీ కేటాయించిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను వేరే ఏ పార్టీకి - ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ముఖ్యమంత్రి సీఈసీని కోరారు. ముఖ్యంగా.. ట్రక్కు - హ్యాట్ గుర్తులు కారును పోలినట్టుగానే ఉంటాయని… వీటిని మరెవరికీ కేటాయించవద్దని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు.

అయితే - వీటికి తోడుగా మ‌రో కీల‌క ప‌రిణామం కూడా చోటు చేసుకుంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటుచేసుకున్న పెద్ద ఎత్తున ఓట్ల లెక్కింపును కూడా కేసీఆర్ సీఈసీ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ‌లో 2.81 కోట్ల ఓట‌ర్లు ఉండ‌గా ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన ఓట‌ర్ల జాబితాలో 2.60 కోట్ల ఓటర్లు ఉన్న‌ట్లుగానే పేర్కొన్నార‌ని కేసీఆర్ ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. దాదాపు 21 ల‌క్ష‌ల ఓట్ల తొల‌గింపు జ‌రిగింద‌ని ఆయ‌న సీఈసీ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు స‌మాచారం. రాబోయే లోక్‌ స‌భ ఎన్నిక‌ల నాటికి అయినా ఈ అంశాన్ని ప‌రిష్క‌రించాల‌ని కేసీఆర్ కోరిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా, తెలంగాణ‌లో ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. నవంబర్ 19న ప్రకటించిన జాబితా కంటే 1,191 మంది ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో మొత్తం 2,80,65,875 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,41,56,564 కాగా, మహిళలు 1,39, 06,450గా ఉన్నారు. ముసాయిదాపై జనవరి 25 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులకు అవకాశం ఉంటుంది. పేర్లు చేర్పూ, మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.