Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. అరుదైన నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   12 April 2020 10:30 AM IST
కరోనా వేళ.. అరుదైన నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్
X
ఆ మధ్యన జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన వేళ చోటు చేసుకున్న పరిస్థితుల నడుమ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి చోటు చేసుకుందని.. దీంతో అందరూ పాస్ అయినట్లుగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట వచ్చింది. అప్పటికే మూడు నాలుగుసార్లు ఫెయిల్ అయిన వారంతా.. ఆ దెబ్బకు పాస్ అయిపోయారని.. తర్వాతి కాలంలో అలా పాస్ అయిన వారిలో ఒక వ్యక్తికి జడ్జి కూడా అయ్యారన్నారు. పరీక్షలు పెట్టకుండానే అంతా పాస్ అనే నిర్ణయం చాలా అరుదుగా తీసుకునేదని.. అప్పుడప్పుడు అలాంటివి జరుగుతాయన్నారు.

కట్ చేస్తే.. శనివారం రాత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిది తరగతి వరకూ విద్యార్థులు ఎవరూ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని.. అందరూ పాస్ అయినట్లుగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.

ఇదిలా ఉంటే.. రెండు..మూడు పరీక్షలు జరిగి.. హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి ఎగ్జామ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయా? అని అటు తల్లిదండ్రులు.. ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని.. త్వరలోనే ఈ అంశం మీద కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి కూడా ఎగ్జామ్స్ లేకుండా ఆల్ పాస్ అనే నిర్ణయాన్ని వెల్లడించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకూ పొడిగించిన వేళ.. తర్వాత కూడా ఎత్తివేస్తారన్న గ్యారెంటీ లేదు.

ఒకవేళ ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నా.. ఒకేసారి ఎత్తివేయరు. దశల వారీగా ఎత్తివేయాల్సి ఉంటుందన్న మాటను కేసీఆర్ చెప్పారు. అలాంటివేళ.. పదో తరగతి ఎగ్జామ్స్ ను ఐదారు లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పుడు.. అంతమంది ఒకేసారి రోడ్ల మీదకు రావటం క్షేమకరమా? అన్నది క్వశ్చన్. కరోనా వేళ.. అంత రిస్కు తీసుకోవటం మంచిది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో సమయం చూసుకొని.. ఆల్ పాస్ అని ప్రకటించే అవకాశం ఎక్కువన్న వినిపిస్తోంది.