Begin typing your search above and press return to search.

నా మతం మానవత్వం.. మాట నిలబెట్టుకునే 'కులం'

By:  Tupaki Desk   |   2 Dec 2019 10:09 AM GMT
నా మతం మానవత్వం.. మాట నిలబెట్టుకునే కులం
X
కొద్దిరోజులుగా తన ప్రభుత్వంపై మత ముద్రవేస్తూ ప్రతిపక్షాలు, టీడీపీ మీడియా చేస్తున్న దుష్ప్రచారాంపై ఏపీ సీఎం జగన్ జగన్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారని.. నాకు చాలా బాధేసిందని.. నా మతం మానవత్వం అని.. కులం.. మాట ‘నిలబెట్టుకునే కులం’ అని సంచలన కామెంట్ చేశారు. నేను ఉన్నాను..నేను విన్నాను అనే మాటను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని జగన్ చెప్పుకున్నారు.

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని గుంటూరులో ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ ఈ సంచలన కామెంట్ చేశారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నానని.. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తున్నాన్నారు. మంచిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేకే నా మీద మత ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. మనిషి ప్రాణాలకు అత్యధిక విలువ ఇస్తూ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికేలా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం గురించి వివరించారు.. ‘ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5వేలు రోగులకు చెల్లిస్తామని తెలిపారు. ప్రజలు కూడా మారాలని..అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. రోగాల బారిన పడవద్దని కోరారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2వేల రోగాలను పెంచుతున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తామని తెలిపారు.

రూ.1000 వైద్య ఖర్చు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తెస్తామని సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ - బెంగళూరు - చెన్నైలో కూడా 130కు పైగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఏపీ ప్రజలు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీలో ఈ మార్పులు చేపట్టినట్లు జగన్ తెలిపారు.