Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆ ఇద్ద‌ర ర‌గ‌డ‌...అవినాష్‌ కు కలిసిసొచ్చిందా...!

By:  Tupaki Desk   |   4 Aug 2019 4:57 AM GMT
వైసీపీలో ఆ ఇద్ద‌ర ర‌గ‌డ‌...అవినాష్‌ కు కలిసిసొచ్చిందా...!
X
విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. నగరంలోని తూర్పు నియోజకవర్గం వైసీపీ ప‌గ్గాల‌ను ఆశించి టీడీపీకి రాజీనామా చేశారు దేవినేని అవినాష్. యువ నాయకుడు జోరుగా ప్రజల్లో తిరగగలిగే చైతన్యం ఉన్న నేత కావడంతో వైసీపీ కీలక నేతలు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆ పదవి తృణపాయంగా త్య‌జించి వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి.

వైసీపీలోకి వ‌చ్చే అవినాష్‌ కు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇస్తార‌ని.. ఈ మేర‌కు హామీ కూడా వ‌చ్చిందంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి? అక్కడ నిజంగానే వైసీపీకి నాయకత్వ లోపం ఉందా? ఇద్దరు కీల‌క నేత‌లు - ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నప్పటికీ.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారా? అనే సందేహాలు తెరమీదకు వస్తున్నాయి.

రాజకీయాల్లో ఎంత లేదన్నా సామాజిక వర్గాల ప్రభావం మెండుగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కులాల కుమ్ములాటలు కూడా రాజకీయాల్లో పెరిగిపోయాయి. విజయవాడ విషయానికి వస్తే.. కొంచెం బెటరే అయినా.. ఇటీవల కాలంలో తూర్పు నియోజకవర్గంలో కమ్మ వర్గం పెరిగిపోయింది. కమ్మ సామాజిక వర్గం నాయకులు ఇక్కడ దృష్టి పెట్టడం - పోష్ వర్గం అంతా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహించడంతో కమ్మ సామాజిక వర్గానికి తూర్పు నియోజకవర్గం నిర్ణయంగా మారిపోయింది.

ఇక పార్టీలు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఆయా సామాజికవర్గానికి చెందిన నాయకులే ఇక్కడ నిలబెడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇదే తరహా వాతావరణం కనిపించింది. అంతెందుకు 2009లోనే ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన నాయకుడు య‌లమంచిలి రవి పీఆర్‌పీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు. ఇక‌ - 2014లో ఇదే సామాజికవర్గానికి చెందిన గ‌ద్దె రామ్మోహ‌న్‌ టిడిపి త‌ర‌పున విజయం సాధించాడు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ గద్దె మరోసారి వరుస విజయం దక్కించుకున్నారు. అయితే ఇక్కడ వైసిపికి ఇద్దరూ కమ్మ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. యలమంచిలి రవి - బొప్పన భ‌వ‌కుమార్. ఇద్దరూ కూడా గత ఎన్నికల్లో ఈ టికెట్ కోసం పోరాడారు. అయితే, జగన్ మాత్రం పీఆర్‌ పీ నుంచి కాంగ్రెస్ వ‌యా టిడిపి - అటు నుంచి వైసీపీలోకి వచ్చి య‌ల‌మంచిలిని పక్కన పెట్టి గతంలో కార్పొరేటర్‌ గా చేసిన బొప్ప‌న భ‌వ‌కుమార్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఎలమంచిలి వర్గం చిన్నబోయింది.

తమకు టికెట్ ఇస్తామంటేనే పార్టీలోకి వచ్చామని - ఆయన వర్గం నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం ఎన్నికల ప్రచారం పై బాగానే పడింది. బొప్ప‌న‌ ప్రచారానికి సహకరించలేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక, బొప్ప‌న కూడా య‌ల‌మంచిలిని పార్టీ ప్రచారానికి ఆహ్వానించలేదు. యలమంచిలి తనకు ఎక్క‌డ‌ పోటీ అవుతారోన‌ని భావించిన బొప్పన మౌనం వహించారు. దీంతో టిడిపి తరపున పోటీ చేసిన గ‌ద్దె విజయం సాధించారు. దీనికి సంబంధించిన రిపోర్టు జగన్‌ కు ఎన్నికల అనంతరం పదిహేను రోజుల్లోనే చేరింది.

వైసీపీలో ఇద్దరు నాయకులు ఆధిపత్య - టికెట్‌ పోరు కారణంగా ఒకరికొకరు సహకరించుకోక‌పోవ‌డం వల్లే పార్టీ ఓట‌మి పాలైంద‌ని గుర్తించిన జ‌గ‌న్ ఇప్పుడు అవినాష్‌ ను ఇక్క‌డ దింపేందుకు వ‌చ్చిని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇక య‌లమంచిలి - బొప్పన విషయానికి వస్తే.. ఎన్నికల ఫలితాలు అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఎక్కడ మీడియాకు కనిపించలేదు. పోనీ ప్రజల్లోనూ లేకుండా పోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనించిన జగన్.. ఇక్కడ సరైన నాయకుడు అవసరం అని గుర్తించే అవినాష్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. అవినాష్‌కు తూర్పులో పార్టీ ప‌గ్గాలు ఇస్తే ర‌వి - భ‌వ‌కుమార్ ప‌రిస్థితి ఏంట‌న్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి.